రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దు
రేగిడి: చెరకు రైతులను ఇబ్బందులు పెట్టవద్దంటూ సంకిలి వద్ద ఉన్న ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగార యాజమాన్యానికి పలువురు రైతులు గురువారం వినతిపత్రం అందజేశారు. రైతులు చెరకును నాటిన కాలాన్ని నమోదుచేయకపోవడం వల్ల సకాలంలో కటింగ్ ఆర్డర్లు ఇవ్వక నష్టపోతున్నామన్నారు. యాజమాన్యం స్పందించి సమస్యను పరిష్కరించాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నారు జనార్దనరావుతో పాటు రైతులు గేదెల సత్యం, తాడేల తవిటినాయుడు, గేదెల రామకృష్ణ, సౌరోతు నీలంనాయుడు, చల్లా స్వామినాయుడు తదితరులు విజ్ఞప్తిచేశారు.
పోలీస్ దర్బార్తో సమస్యల పరిష్కారం
విజయనగరం క్రైమ్: ఆర్మ్డ్డ్ రిజర్వు పోలీసుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ‘పోలీసు దర్బార్’ను ఎస్పీ ఏఆర్ దామోదర్ గురువారం నిర్వహించారు. పోలీస్ సిబ్బంది వ్యక్తిగత, వత్తిపరమైన సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. పదోన్నతులు, ఇంక్రిమెంట్ల అంశాన్ని ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. పోలీస్ సిబ్బంది చక్కగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు. వృత్తిలో ప్రతిభ చూపేవారికి రివార్డులు అందజేస్తున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో సీఐలు ఎ.వి.లీలారావు, విద్యాసాగర్, రిజర్వు ఇన్స్పెక్టర్లు ఎన్.గోపాల నాయుడు, ఆర్.రమేష్ కుమార్, పి.శ్రీనివాసరావు, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
దోపిడీకి పాల్పడితే క్రిమినల్ చర్యలు
విజయనగరంక్రైమ్: హెచ్ఆర్సీ, ఆర్టీఐ అధికారులమంటూ ఎవరైనా దోపిడీలకు, అక్రమ వసూళ్లకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తప్పని ఎస్పీ దామోదర్ గురువారం హెచ్చరించారు. ఇటీవల కొంతమంది నేషనల్ హ్యుమన్ రైట్స్ కమిషన్, ఆర్టీఐ అధికారుల పేరుతో అమాయక ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వ్యక్తుల గురించి సమాచారం అందిస్తే రౌడీ షీట్స్ తెరుస్తామన్నారు.
పుణ్యగిరిని సందర్శించిన కలెక్టర్
శృంగవరపుకోట: భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ రాంసుందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. పలువురు అధికారులతో కలిసి పుణ్యగిరిని గురువారం సందర్శించారు. పుణ్యగిరి మెట్లమార్గం నుంచి ప్రధాన ఆలయం వరకు చేస్తున్న ఏర్పాట్లను తహసీల్దార్ శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. భక్తుల రద్తీ నియంత్రణకు ఏం చర్యలు తీసుకుంటున్నారంటూ సీఐ నారాయణమూర్తిని అడిగి తెలుసుకున్నారు. పుణ్యగిరి, రామతీర్థం క్షేత్రాలకు శివరాత్రి వేళ 50 వేలకు పైగా భక్తులు వస్తారని అంచనా ఉందని, ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆయన వెంట ఆర్డీఓ కీర్తి, తహసీల్దార్ శ్రీనివాసరావు, దేవస్థానం ఈఓ నాగేంద్ర, ఎస్.కోట పంచాయతీ ఈఓ చంద్రశేఖర్, ఉత్సవకమిటీ చైర్మన్ పెదగాడి రాజు, తదితరులు ఉన్నారు.
రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దు
రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దు


