ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత ప్రవేశాలకు ఆహ్వానం
● 1వ తరగతిలో 25 శాతం సీట్ల కేటాయింపు
● ఈ నెల 20 నుంచి దరఖాస్తుల స్వీకరణ
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాహక్కు చట్టం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 2026–27 విద్యాసంవత్సరంలో అన్ని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం డీఈఓ యూ.మాణిక్యంనాయుడు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఐబీ, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, స్టేట్ సిలబస్ అనుసరించి ఉన్న అన్ని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలకు ఈ ప్రవేశాలు వర్తిస్తాయి. ఆర్ధికంగా వెనుకబడిన, బలహీన వర్గాల పిల్లలు అర్హులు, ఈ సీట్లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు 8వ తరగతి వరకు ఉచిత విద్య అందుబాటులో ఉంటుంది. ఆయా స్కూల్ స్థాయిలో ఉన్న ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రస్తుతం 5 సంవత్సరాలు నిండిన పిల్లల తల్లిదండ్రుల నుంచి ఈ నెల 20వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రధానంగా ‘సీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’ వెబ్సైట్లో ఆధార్ ద్వారా ప్రాథమిక వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో అయితే గ్రామ/వార్డు సచివాలయం, మండల విద్యా వనరుల కేంద్రం, సంబంధిత ప్రైవేట్ పాఠశాలల్లో కూడా దరఖాస్తు సమర్పించవచ్చు. అర్హత ధ్రువీకరణ తర్వాత లాటరీ విధానంలో సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఎంపికై న విద్యార్థుల జాబితా సంబంధిత పాఠశాలల్లో ప్రదర్శిస్తారు. 2020 ఏప్రిల్ 2 నుంచి 2021 మార్చి 31వ తేదీ మధ్యలో జన్మించిన పిల్లలు (5 సంవత్సరాలు నిండి ఉండాలి) మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. చిరునామా ధ్రువీకరణకు తల్లిదండ్రుల ఆధార్కార్డు, ఓటరు కార్డు, రేషన్కార్డు, భూమి హక్కుల పత్రాలు, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, విద్యుత్ బిల్లు లేదా రెంటల్ అగ్రిమెంట్ కాపీ వంటి పత్రాలలో ఏదైనా ఒకటి, పిల్లల వయస్సు ధ్రువీకరణ పత్రంగా జతచేయాల్సి ఉంటుంది. సందేహాల నివృత్తి కోసం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించవచ్చు. టోల్ ఫ్రీ నంబర్ 18004258599. జిల్లా సమాచారం, సమస్యల పరిష్కారం కోసం సమగ్రశిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ను సంప్రదించాలి. పేద, బలహీన వర్గాల పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ కోరారు.


