సమాచార లోపం.. అర్జీదారులకు కష్టం
● కొలువు తీరని ప్రజా సమస్యల పరిష్కార వేదిక
● ప్రత్యామ్నాయంగా వినతుల స్వీకరణ
పార్వతీపురం రూరల్: కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పీజీఆర్ఎస్)ను ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో విజయవాడలో మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో జరిగే కీలక సమావేశం కారణంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు అధికారులు అందరూ ఈ సమీక్షలో వర్చువల్గా పాల్గొనాల్సి రావడంతో గ్రీవెనన్స్ సెల్తో పాటు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను కూడా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే, రద్దు ప్రకటన ఆదివారం రాత్రి పొద్దుపోయాక వెలువడడంతో జిల్లాలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు ఈ సమాచారం చేరలేదు. ఎప్పటిలాగానే తమ గోడు వెళ్లబోసుకోవచ్చని భావించిన అర్జీదారులు సోమవారం ఉదయమే భారీ సంఖ్యలో కలెక్టరేట్కు చేరుకున్నారు. తీరా అక్కడికి వచ్చాక కార్యక్రమం రద్దయిందని తెలియడంతో అర్జీదారులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. దూరాభారం నుంచి వచ్చిన వారి ఇబ్బందులను గమనించిన కలెక్టరేట్ అధికారులు, తహసీల్దార్ స్థాయి అధికారితో వినతులను స్వీకరించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా పింఛన్ల మంజూరు, రెవెన్యూ వివాదాలు, ఏనుగుల గుంపు వల్ల జరుగుతున్న పంటనష్టం వంటి సమస్యలపై బాధితులు అధికారులకు విన్నవించుకుని వెనుదిరిగారు.
సమాచార లోపం.. అర్జీదారులకు కష్టం


