
డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులు భర్తీ చేయాలి
విజయనగరం గంటస్తంభం: రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ తక్షణమే ఇచ్చి 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సీహెచ్ హరీష్, డీఎస్సీ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి. కొండపల్లి శ్రీనివాస్కు వినతిపత్రం శనివారం అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టులను రద్దుచేసి సూపర్ సిక్స్లో భాగంగా అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి హోదాలో మొదటి సంతకం పెట్టి మొదటికే డీఎస్సీ అభ్యర్థులని మోసం చేశారని ఆరోపించారు. పది నెలలు గడిచినా మొదటి సంతకాన్ని అమలు చేయలేదని వాపోయారు. వారంలో మెగా డీఎస్సీ అని ముఖ్యమంత్రి, త్వరలోనే మెగా డీఎస్సీ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికి పదిసార్లు ప్రకటనలు చేసి నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేశారన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏప్రిల్ మొదటి వారానికి నోటిఫికేషన్ ఇస్తామని జూన్ నాటికి భర్తీ చేస్తామని హామీ ఇచ్చారన్నా రు. జిల్లాలో దాదాపు 20 వేల మంది నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారన్నారు. గత ఏడేళ్లుగా ఒక్క నోటిఫికేషన్ లేకపోవడంతో ఒక వైపు కుటుంబం నుంచి ఒత్తిడి మరోవైపు అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా డీఎస్సీలో 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో మురళి, నరేష్, డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు.
డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ హరీష్
జిల్లా మంత్రికి వినతిపత్రం అందజేత