గోపాలపట్నం: విశాఖపట్నం ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో రవాణా శాఖ, హోండా మోటార్ సైకిల్ స్కూటర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రాథమిక రోడ్డు భద్రతా శిక్షణ కార్యక్రమం ఆరేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఉప రవాణా కమిషనర్ ఆర్సీహెచ్ శ్రీనివాసరావు మాట్లాడారు. శిక్షణ తరగతులను 2020లో ప్రారంభించారని, ఇప్పటి వరకు 1,26,090 మందికి శిక్షణ ఇచ్చారని తెలిపారు. లెర్నింగ్ లైసెన్స్కు హాజరయ్యేవారంతా ఇక్కడ ప్రాథమిక శిక్షణ పొందుతారన్నారు. ప్రతీ అభ్యర్థికి రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు, సురక్షిత డ్రైవింగ్ పద్ధతులు, ప్రమాదాల నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. శిబిరంలో హోండా ప్రతినిధులతో పాటు మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం.బుచ్చిరాజు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారన్నారు. కార్యక్రమంలో హోండా సంస్థ ప్రతినిధులు ఆశిక్, సాయి మౌళి రవాణా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


