ఏయూలో కొందరిపై అవాజ్య ప్రేమ
విశాఖ విద్య: ఏయూలో యాజమాన్య వైఖరి వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటికే తన నిర్ణయాలతో విమర్శలు ఎదుర్కొంటున్న యంత్రాంగం ఉన్నత విద్యాశాఖ నిర్ణయాలను కాదని ముందుకు వెళుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో తలెత్తిన వివాదం చిలికిచిలికి గాలివానగా మారుతోంది. పద్ధతి ప్రకారం ఏపీపీఎస్సీ పరీక్షలో పాసయిన వారికే ప్రమోషన్లు కల్పించాలనే నిబంధన ఉన్నప్పటికీ కొందరి విషయంలో అమలు కాకపోవడంతో ఉద్యోగ వర్గాలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి. అలాంటివారే ఏయూలో పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణ ప్రధానంగా వినిపిస్తోంది.
పరీక్ష ఎందుకు?
ఏపీ ఎంప్లాయిస్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఉద్యోగస్తులకు ప్రమోషన్ అమలు చేయడానికి ఉన్నత విద్యాశాఖ ఒక ప్రతిపాదనను 2019లో అమల్లోకి తీసుకువచ్చింది. ఆల్ ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ నాన్ టీచింగ్ స్టాఫ్కు పదోన్నతి రావాలంటే కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి పాస్ కావలసిందే. జూనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటిండెంట్ ప్రమోషన్ వరకు ఏపీపీఎస్సీ పరీక్ష కోడ్ 8, కోడ్ 10 రాయవలసి ఉంటుంది. అలాగే అసిస్టెంట్ రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్, జాయింట్ రిజిస్ట్రార్ ప్రమోషన్ కోసం పరీక్ష కోడ్ 141 రాయాల్సిందే. ఈ పరీక్షలు రాసి పాస్ కానివారికి పదోన్నతులు ఉండవని స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ఇటీ వల ఏయూలో జరిగిన పదోన్నతుల్లో ఇదే పద్ధతిని అమలు చేశారు కూడా. ఒకవేళ ఈ నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్ తీసుకున్నట్లు తేలితే రివర్షన్ చేయాలనే కచ్చితమైన నిబంధన కూడా ఉంది.
పదోన్నతుల్లో మతలబు
నాన్ టీచింగ్ స్టాఫ్ విషయంలో ఆంధ్ర యూనివర్సిటీలోనూ, మిగిలిన ప్రభుత్వ వర్సిటీల్లోనూ గతంలో, ఇటీవల ఇచ్చిన ప్రమోషన్స్ అన్నింటిలో ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించాలనే నిబంధనను అమలు చేసి ప్రమోషన్లు ఇచ్చారు. అంటే కోడ్ 8, 10, 141 పాస్ అయినవారికి మాత్రమే పదోన్నతులు ఇచ్చారు. పాస్ కాని వారికి ప్రమోషన్ ఇవ్వలేదు. కానీ ఆంధ్ర యూనివర్సిటీలో అర్హత పరీక్ష రాయకుండా ఇప్పటికే ప్రమోషన్ తీసుకున్నవారు ఉన్నా, వారికి ఈ నిబంధన ఎందుకు అమలు చేయడం లేదనే ప్రశ్న ఎదురవుతోంది. ఇలాంటి వారిని పదోన్నతుల నుంచి రివర్షన్ చేయాలనే డిమాండ్ వస్తోంది. ఉద్యోగ సంఘాల నేతలు ఏయూ యాజమాన్యాన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని డిమాండ్ చేస్తున్నారు. అర్హత సాధించినవారికి పదోన్నతులు ఇవ్వాలని ఉద్యోగస్తులు కోరుతున్నారు. లేదంటే పాస్ కాని వారిని కూడా గత ప్రమోషన్స్ నుండి వారి సీనియారిటీ ప్రొటెక్ట్ చేసి, పాస్ కాని వారిలాగే వారికి కూడా ప్రమోషన్స్ ఇవ్వాలని ఉద్యోగస్తులు కోరుతున్నారు. అందరికీ సమాన న్యాయం చేయాలని, లేదంటే అర్హత పొందని వారిని ఇప్పుడు ఉన్న పదవి నుండి కింది పదవికి తక్షణమే డిప్రమోషన్ చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ఏయూలో అలాంటివారు సుమారు 30 మంది ఉద్యోగులు ఉన్నారని, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలనే వాదన పెరుగుతోంది. అలాంటివారిపై ఎందుకు ప్రేమ చూపిస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. పదోన్నతి అర్హత పరీక్ష పాస్ కాని వారికి సెలక్షన్ గ్రేడ్ కూడా ఆపేశారని గుర్తు చేస్తున్నారు. సెలక్షన్ గ్రేడ్ ఆపడానికి ఎవరికీ హక్కు లేదని, అలాగే ప్రమోషన్ తీసుకుని పాస్ కాని వారికి సెలక్షన్ గ్రేడ్ ఏ ప్రాతిపదికన ఇస్తున్నారని కూడా యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. పాలకవర్గం స్పందించకపోతే నేరుగా ప్రభుత్వానికి, లేదంటే న్యాయస్థానానికి వెళ్లేందుకు ఉద్యోగ వర్గాలు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
యాజమాన్య తీరుపై ఉద్యోగసంఘాల ఆగ్రహం
ఉన్నత విద్యశాఖ నిర్ణయాన్ని తుంగలో తొక్కిన వైనం


