మహారాణిపేట: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పెండింగ్ కేసుల విచారణ వేగవంతం చేయాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్ ఆదేశించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ మీటింగ్ హాల్లో శనివారం జరిగిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ, సఫాయి కర్మచారుల జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. విచారణ దశలోని 106 అట్రాసిటీ కేసులు, పెండింగ్ ట్రయిల్లోని 689 కేసుల విషయంలో త్వరగా ఫలితాలు వచ్చేలా అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. 2026లో 42 కేసులకు గాను 40 కేసుల్లో రూ.62.88 లక్షల నష్టపరిహారం అందజేశామని, 2 కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు.
సఫాయి కర్మచారుల సమస్యల పరిష్కారానికి చర్యలు
హెచ్పీసీఎల్ వంటి ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో సఫాయి కర్మచారుల కుటుంబాల్లోని అర్హులైన యువతీ యువకులకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి, ఉద్యోగ అవకాశాలు కల్పించేలా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సఫాయి కర్మచారుల సమస్యలు పరిష్కరించేందుకు రెవెన్యూ డివిజినల్ అధికారుల నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేసి సమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. సీపీ బాగ్చి మాట్లాడుతూ నగరంలో బహిరంగ మూత్ర విసర్జన జరగకుండా నివారించాలని సూచించారు. సమావేశాల్లో డీసీపీ–1 మణికంఠ, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ కె.రామారావు, విశాఖ ఆర్డీవో దిలీప్ చక్రవర్తి, డీఈవో ప్రేమకుమార్, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ జి.శ్యామ్బాబు, ఏసీపీలు, వివిధ విభాగాల అధికారులు, కమిటీ సభ్యులు ప్రొఫెసర్ డాక్టర్ పి.సుబ్బారాయుడు, సిహెచ్.రాంబాబు, రమణ, శ్రీనివాసరావు, రాంబాబు, ఆంజనేయ, మాలతి తదితరులు పాల్గొన్నారు.


