మట్టి మహాగణపతులుగా ఆకృతి దాల్చుతోంది. కళాకారుల చేతులు విభిన్న రూపాల్లో నిశ్శబ్దంగా అద్భుతాలు సృష్టిస్తున్నాయి. విశాఖ తీరపు గాలుల్లో పచ్చి మట్టి సువాసనలు పరిమళిస్తుంటే, కుంచె కొన నుంచి జాలువారిన వర్ణాలు ఆ గణనాథులకు దివ్యమైన జీవకళను అద్దుతున్నాయి. కళ్లకు కాటుక.. నుదుట తిలకం.. తలపై కిరీటంతో తుది మెరుగులు దిద్దుకుంటున్న ఆ ప్రతిమల వెనుక శిల్పుల నిరంతర శ్రమ, అపారమైన భక్తి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. వినాయక చవితి సమీపించడంతో చిన్నవి, పెద్దవి.. భక్తుల అభిరుచికి తగ్గట్టుగా నెలల తరబడి శ్రమించి తయారు చేసిన విగ్రహాలు ఇళ్లకు, మండపాలకు తరలివెళ్లి పూజలందుకునేందుకు, పండగ శోభను మరింత ఇనుమడింపజేసేందుకు సిద్ధమవుతున్నాయి.
–ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్ , విశాఖపట్నం


