స్పోర్ట్స్ ఎరీనాను సందర్శించిన చైనా బృందం
ఎంవీపీకాలనీ: ఎంవీపీ కాలనీలోని జీవీఎంసీ స్పోర్ట్స్ ఎరీనాను చైనా క్రీడా ప్రతినిధుల బృందం శనివారం సందర్శించింది. అంతర్జాతీయ బ్రిక్స్ సదస్సుల నేపథ్యంలో చైనాకు చెందిన ఉన్నత స్థాయి క్రీడా ప్రతినిధుల బృందం నగర పర్యటనకు వచ్చింది. ఈ సందర్భంగా స్పోర్ట్స్ ఎరీనాలో క్రీడాకారులకు అందిస్తున్న శిక్షణ, ప్రోత్సాహం, మౌలిక వసతుల వివరాలను జీవీఎంసీ అదనపు కమిషనర్ పల్లి నల్లనయ్య వారికి వివరించారు. చైనా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్ వైస్ మినిస్టర్ కుయ్ జియాన్ మాట్లాడుతూ క్రీడలు కేవలం ప్రత్యర్థిని ఓడించడానికే కాకుండా, మనల్ని మనం మెరుగుపరుచుకునేందుకు దోహదపడతాయన్నా రు. క్రీడాభివృద్ధిలో భారత్–చైనా మధ్య సహకారం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఎస్డీఓ జాన్ జూలియట్, జీవీఎంసీ తూర్పు జోన్ కమిషనర్ కె. శివప్రసాద్ పాల్గొన్నారు.


