కొమ్మాది: ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాల కంటే రాద్ధాంతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు వ్యాఖ్యా నించారు. రుషికొండలోని ఓ రిసార్ట్స్లో మా శర్మ రచించిన ‘వెంకయ్య నాయకుడు’ పుస్తక పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత రాజకీయాల్లో కొందరు నాయకులు ఒక రోజు మాట్లాడిన మాటను మరుసటి రోజు మార్చేస్తున్నారని విమర్శించారు. తిరుపతి లడ్డూ, పరకామణి, శబరిమల, రామమందిరానికి సంబంధించిన ఘటనలు తనను కలచివేశాయన్నారు. వాటికి బాధ్యు లైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమాజంలో నైతిక విలువలు క్షీణించడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. తన రాజకీయ జీవితంలో ఆర్టికల్ 370 రద్దు ఒక కీలక ఘట్టమని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజకీయా ల్లో బూతులు మాట్లాడేవారు ఎక్కువవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత సిద్ధాంతాలకు కట్టుబడి రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. హోంమంత్రి అనిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే లు గంటా, వెలగపూడి , పంచకర్ల, గణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు.
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు


