ఎంవీపీ కాలనీ: ఆదివాసీల హక్కుల పరిరక్షణకు ఐక్య ఉద్యమం చేపడతామని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు తెలిపారు. అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎంవీపీ కాలనీలోని గిరిజన భవన్లో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి అఖిలపక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల హక్కులను బలహీనపరిచే చర్యలకు పాల్పడుతున్నాయన్నారు. 1/70 చట్టాన్ని రద్దు చేసే ప్రయత్నాలు అందులో భాగమేనని ఆరోపించారు. రాజ్యాంగం షెడ్యూల్డ్ ప్రాంతాల ప్రజలకు కల్పించిన హక్కులను పరిరక్షించుకునేందుకు ఆదివాసీలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జీవో నం.3 పునరుద్ధరణ, గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ల విస్తరణ తదితర అంశాలపై తీర్మానాలు చేశారు. ఈ తీర్మానాలను ముఖ్యమంత్రి కార్యాలయం, రాష్ట్ర గవర్నర్, జాతీయ ఎస్టీ కమిషన్, రాష్ట్రపతి కార్యాలయాలకు పంపాలని నిర్ణయించినట్లు సంఘం రాష్ట్ర కార్యదర్శి శోభన్కుమార్ తెలిపారు. కార్యక్రమంలో అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి, ఎమ్మెల్యే ఆర్.మత్స్యలింగం, మాజీ మంత్రి బాలరాజు, జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర, జీసీసీ మాజీ చైర్పర్సన్ స్వాతిరాణి, సంఘం రాష్ట్ర చైర్మన్ వంపూరు గంగులయ్య, జయరాజు, కె.భాగ్యలక్ష్మి, కొక్కుల రామారావు తదితరులు పాల్గొన్నారు.


