డాబాగార్డెన్స్: ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 14న జిల్లా కలెక్టరేట్ వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో చేపట్టనున్న ఆందోళనను విజయవంతం చేయాలని స్టేట్ టీచర్స్ యూనియన్(ఎస్టీయూ) పిలుపునిచ్చింది. నగరంలోని ఓ హోటల్లో ఆదివారం నిర్వహించిన ఎస్టీయూ విశాఖపట్నం జిల్లా ద్వితీయ కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు సీహెచ్.పద్మావతి, ప్రధాన కార్యదర్శి ఇమంది పైడిరాజు మాట్లాడుతూ, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని ఆందోళనకు మద్దతు ఇవ్వాలని కోరారు. రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, మధ్యంతర భృతి(ఐఆర్) ప్రకటన, ఐదు విడతల కరవు భత్యం(డీఏ) విడుదల వంటి అంశాలపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించడం సమంజసం కాదన్నారు. 20–30 ఏళ్లుగా సేవలందిస్తున్న ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేయడంపై కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించి విద్యా హక్కు చట్టంలో అవసరమైన మార్పులు తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా మెగా డీఎస్సీలో ఎంపికై న ఉపాధ్యాయులను ఎస్టీయూ ఆధ్వర్యంలో సన్మానించారు. అలాగే విశాఖ జిల్లా గౌరవ అధ్యక్షుడిగా గంటాన మోహన్రావును, జిల్లా కన్వీనర్గా బండి వెంకటకుమార్ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు ఐవీ వెంకటరామిరెడ్డి, జిల్లా నాయకులు వరహాల దొర, పురుషోత్తం, పీఎస్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


