
మద్యం దుకాణం వద్దంటూ మహిళల ఆందోళన
కంచరపాలెం: ఇందిరానగర్–5 ప్రాంతంలోని జనావాసాల మధ్య మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు ఆందోళనకు దిగారు. కంచరపాలెం జాతీయ రహదారికి ఆనుకుని సబ్వే పక్కన ఓ టిఫిన్ దుకాణంలో ఎస్వీఆర్ వైన్స్ పేరుతో మద్యం దుకాణాన్ని ప్రారంభించే ప్రయత్నం జరిగింది. దీంతో ఇందిరానగర్–5 కాలనీ మహిళలు మద్యం దుకాణం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. జనావాసాలు, ఆలయాలకు దగ్గరలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణం ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు ప్రయత్నించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నాయకుల అండతోనే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు ధర్మాల ఆనందకుమార్ రెడ్డి, స్థానిక మహిళా నాయకులు పద్మ, అమ్మాజీ, మణి నేతృత్వంలో దుకాణం ముందు టెంట్లు వేసి, ప్లకార్డులతో ‘మద్యం దుకాణం వద్దు–భద్రతే మాకు ముద్దు’అంటూ నినాదాలు చేశారు. జనావాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో చినబాబు, యశోదరావు, త్రినాథ్, రాజు తదితరులు పాల్గొన్నారు.