● అన్ని శాఖల అధికారులుసమన్వయంతో పని చేయాలి
● ఎమ్మెల్యే మనోహర్రెడ్డి
తాండూరు: అధికారులు సమన్వయంతో పని చేసి నేటి నిమజ్జన వేడుకలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మనోహర్రెడ్డి సూచించారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, అగ్నిమాపక శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించాలని డీఎస్పీ నర్సింగ్ యాదయ్యకు సూచించారు. విద్యుత్ తీగల విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. పారిశుద్ధ్యం, తాగునీరుని పర్యవేక్షించాలని తెలిపారు. వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. శోభాయాత్ర తిలకించేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలని తెలిపారు. విగ్రహాల నిమజ్జనం చేసే కోకట్ కాగ్నా నది, మల్రెడ్డి పల్లి చెరువుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అనంతరం అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి వినాయక శోభాయాత్ర మార్గాలను సందర్శించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నీరజాబాల్రెడ్డి, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పట్టణ శివారులోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను తనిఖీ చేశారు. నైపుణ్య విద్యపై విద్యార్థులకు శిక్షణ కల్పిస్తున్నారా లేదా అనే విషయమై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఎదురైతే సమాచారం అందించాలని సూచించారు. త్వరలోనే విద్యార్థులకు స్కాలర్ షిప్లను అందిస్తామని తెలిపారు.
కాగ్నా వద్ద ఏర్పాట్లు పూర్తి
యాలాల: తాండూరులో ప్రతిష్ఠించిన గణేశ్ విగ్రహాలను మండలంలోని కోకట్ కాగ్నా నదిలో నిమజ్జనం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలందుకుంటున్న గణనాథులకు ఇక్కడ నిమజ్జనం చేయడం అనవాయితీగా వస్తోంది. బ్రిడ్జికి ఇరువైపులా కంప చెట్లను జేసీబీలతో తొలగించారు. రోడ్డుపై పడిన గుంతలను పూడ్చారు. కర్రలతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి విగ్రహాలు రానుండటంతో అన్ని ఏర్పాట్లు చేశారు. అర్ధరాత్రి వరకు నిమజ్జన ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. అత్యవసర సేవలు, ఫైరింజన్, వైద్య సిబ్బంది, మున్సిపల్, పంచాయతీ వర్కర్లు, గత ఈతగాళ్లను అందుబాటులో ఉంచనున్నారు. ఏర్పాట్లను గురువారం సాయంత్రం ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, ఎస్పీ స్నేహమెహ్ర, ఆర్డీఓ అనిత, డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ నీరజా, సొసైటీ చైర్మన్ సురేందర్రెడ్డి, గ్రామ సర్పంచ్ రాజేందర్రెడ్డి, మాజీ సర్పంచ్ హన్మంతు ముదిరాజ్ తదితరులు పరిశీలించారు.


