అనంతగిరి: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాటం స్ఫూర్తిదాయకమని జాతీయ సాహిత్య పరిషత్ పూర్వ అధ్యక్షుడు ఆచార్య కసిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్లో పద్యపదభారతి గౌరవ అధ్యక్షుడు, డైట్ రిటైర్డు ప్రిన్సిపాల్ బందెప్పగౌడ్ రచించిన సర్దార్ పాపన్న గౌడ్ శతకం ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం బందెప్పగౌడ్ చిన్ననాటి గురువైన గోగి నాగేంద్రరావుకు పాదపూజ చేసి పుస్తకం అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా కసిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. పాపన్నగౌడ్ మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. మొగులాయిలపై తిరుగుబాటు చేసిన మొదటి స్వాత్రంత్య పోరాట యోధుడన్నారు. కుతుబ్షాహీల అనంతరం ఆనాటి గొప్ప దుర్గం గోల్కొండను 1688 నుంచి 1724 వరకు పాలించారన్నారు. భువనగిరి కోటతో మొదలయి 21 కోటలను ఆక్రమించి విజయబావుటా ఎగరేశారని కొనియాడారు. సామాజిక సమానత్వం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ముందుండి పోరాటం చేశారని తెలిపారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు. ముఖ్య వక్తగా విచ్చేసిన జయదేవ్ మాట్లాడుతూ.. సర్దార్ పాపన్నగౌడ్ శివాజీ సమకాలీకులని, ఇద్దరి యుద్ధవిద్య పరిపాలన తీరొక్కటే అన్నారు. కార్యక్రమంలో రిటైర్డు ప్రిన్సిపాల్ తూర్పు మల్లారెడ్డి, బద్రినాథ్, బాలకృష్ణగౌడ్, గౌడ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మల్లికార్జున్ గౌడ్, వెంకటయ్యగౌడ్, పద్యపద భారతి వ్యవస్థాపక అధ్యక్షుడు శతవధాని అంజయ్య, అధ్యక్షుడు రాఘవేంద్రచార్యులు, కార్యదర్శి లాల్రెడ్డి, హమయ్యగౌడ్, బాలస్వామి, నర్సింహరెడ్డి, కృష్ణస్వామి, సుధాకర్గౌడ్, రెడ్యా రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
ఆచార్య కసిరెడ్డి వెంకట్రెడ్డి


