నవాబుపేట: అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు లేకపోయినా ఆ కేంద్రానికి పౌష్టికాహారం సరుకులు సరఫరా అవుతున్నాయి. మండల పరిధిలోని గొల్లగూడ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం కేవలం టీచర్ అరుణ, ఆయా ఈశ్వరమ్మ మాత్రమే ఉన్నారు. పిల్లలు ఎక్కడ అని ప్రశ్నించడంతో ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారని చెప్పారు. పిల్లలు లేనప్పుడు పాలు, గుడ్లు, బాలామృతం తదితర సామగ్రి ఎందుకు కేంద్రంలో ఉందని అడగడంతో సరైన సమాధానం చెప్పలేదు. పిల్లల అటెండెన్స్ రిజిస్టర్ చూపమని అడిగితే పొంతనలేని సమాధానాలు చెప్పారు. పిల్లలు లేని అంగన్వాడీ కేంద్రానికి సరుకులు పంపిణీ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయమై ఐసీడీఎస్ సీడీపీఓ శ్రీలతను వివరణ కోరగా... కేంద్రాల వారీగా అంగన్వాడీ టీచర్లే అవసరమైన సరుకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సరఫరా అవుతుందని చెప్పారు. ఆ కేంద్రానికి ఎంతమంది బాలింతలు, గర్భిణులు, పిల్లలు వస్తారో వారికి మాత్రమే సరుకులు పంపిణీ చేస్తాం. గొల్లగూడ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చర్యలు తీసుకుంటామన్నారు.
పిల్లలు లేని కేంద్రానికి సరుకుల పంపిణీ


