మతిస్థిమితం లేనివ్యక్తి కుటంబసభ్యుల చెంతకు
కొడంగల్ రూరల్: మతిస్థిమితం లేని వ్యక్తిని ఆదివారం అమ్మా–నాన్న ఫౌండేషన్ సభ్యులు కుటుంబసభ్యులకు అప్పగించారు. గుంటూరుకు చెందిన ప్రసన్నాంజనేయం మతిస్థిమితం కోల్పోయాడు. దీంతో ఆయన్ను అమ్మా నాన్న ఫౌండేషన్ సభ్యులు చేరదీసి కొత్త బట్టలు ఇచ్చి, అతనికి షెల్టర్ కల్పించారు. అతని వివరాలను సేకరించి కుటంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో ఆదివారం గుంటూరు నుంచి కొడంగల్కు కుటుంబసభ్యులు చేరుకున్నారు. దీంతో మతి స్థిమితం లేని వ్యక్తిని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో అమ్మానాన్న ఫౌండేషన్ ఫౌండర్ ప్రవీణ్కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
అ‘పూర్వ’ సమ్మేళనం
కుల్కచర్ల: మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో ఆదివారం పూర్వవిద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. పాఠశాలలో 2000–01 విద్యాసంవత్సరంలో పదోతరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. అనంతరం వారికి విద్యాబుద్దులు నేర్పిన గురువులను సన్మానించారు.
గృహిణి అదృశ్యం
పహాడీషరీఫ్: భర్తతో గొడవపడిన గృహిణి అదృశ్యమైన సంఘటన బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మల్లాపూర్ గ్రామానికి చెందిన కొమిరి యాదయ్య భార్య శారద (38) కూలి పని చేస్తుంటుంది. గత నెల 26న రాత్రి భర్త, పిల్లలతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. తిరిగి రాకపోవడంతో ఆమె ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆమె భర్త ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్స్టేషన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఊరికి వెళ్లే విషయమై భర్తతో గొడవపడి ఆత్మహత్య
రంగారెడ్డి నగర్: ఊరికి వెళ్లే విషయమై భర్తతో గొడవ పడిన ఓ మహిళ క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడింది. పేట్బషీరాబాద్ పోలీసులు తెలిపిన ప్రకారం... దూలపల్లికి చెందిన తుపాకుల రవీందర్, లావణ్య(30) భార్యాభర్తలు. ఆదివారం ఉదయం స్వగ్రామానికి వెళ్లే విషయమై వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మనస్తాపానికి గురైన లావణ్య బెడ్రూమ్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. భర్త రవీందర్ తలుపులు తట్టగా తీయలేదు. దీంతో అతడు తలుపులు బద్దలకొట్టి లోనికి వెళ్లి చూడగా సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరేసుకుని కనిపించింది. వెంటనే ఆమెను కిందికి దింపి సమీపంలోని ఆస్పత్రికి తరించగా అప్పటికే మృతి చెందింది. మృతురాలి తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అసలే అక్రమం.. ఆపై కల్తీ!
● సింథటిక్ రంగులతో అల్లం వెల్లుల్లి పేస్ట్
● గుట్టురట్టు చేసిన శంషాబాద్ టాస్క్ఫోర్స్
సాక్షి, సిటీబ్యూరో: నాసిరకం ముడిసరుకులతో అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యానికి హానికరమైన సింథటిక్ రంగులు వాడుతున్న ముఠా గుట్టును శంషాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఆదివారం రెండు ప్రాంతాల్లో దాడులు చేసి నలుగురిని పట్టుకున్నారు. రూ.10 లక్షల విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అదనపు డీసీపీ ఇక్బాల్ సిద్ధిఖీ వివరాలు వెల్లడించారు. జల్పల్లి ప్రాంతంలో అబ్దుల్ సత్తార్ అనుమతులు, లేబర్ లైసెన్స్ లేకుండా, అపరిశుభ్రమైన వాతావరణంలో ‘ఓ రాయల్ ఎంటర్ర్పైజెస్’, ‘షాహీ గోల్డ్ ’కంపెనీల పేరిట కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నాడు. ఈ పేస్టును స్థానిక కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు. ఇతడికి జల్పల్లితోపాటు ముస్తాఫానగర్లోనూ కార్ఖానాలు ఉన్నాయి. టాస్క్ఫోర్స్ పోలీసులు వాటిపై దాడి చేసి ప్రధాన నిందితుడు సత్తార్తోపాటు మొహమ్మద్ ఇస్మాయిల్, మొహమ్మద్ ఇఫ్తేఖర్, నూర్ నబీలను పట్టుకున్నారు. వీరి నుంచి 340 కిలోల విడి అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఒక్కోటి 50 కిలోల బరువు ఉన్న 12 పెద్ద టబ్ల అల్లం మిశ్రమం, ఒక్కోటి 25 కిలోల బరువు ఉన్న 20 సంచుల వెల్లుల్లి మిశ్రయం, ఐదు సంచుల ఉప్పు, అజంతా లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ బాక్సులు, సిట్రిక్ యాసిడ్ పౌడర్లను స్వాధీనం చేసుకున్నారు. కేసును పహాడీషరీఫ్ పోలీసులకు అప్పగించారు.
మతిస్థిమితం లేనివ్యక్తి కుటంబసభ్యుల చెంతకు
మతిస్థిమితం లేనివ్యక్తి కుటంబసభ్యుల చెంతకు


