గోదాంలో అగ్నిప్రమాదం
● కాలిబూడిదైన ఆటోమొబైల్స్ స్పేర్ పార్ట్స్
● సుమారు రూ.5కోట్ల ఆస్తినష్టం
చేవెళ్ల: ఆటోమొబైల్స్ స్పేర్పార్ట్స్ గోదాంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సుమారు రూ.5 కోట్ల మేర ఆస్తినష్టం వాటిల్లింది. పోలీసుల కథనం ప్రకారం.. చేవెళ్లలోని శంకర్పల్లి రోడ్డులో రిషిత ఆటోమొబైల్స్ స్పేర్పార్ట్స్ (హీరో కంపెనీ)గోదాం ఉంది. గ్రౌండ్ఫ్లోర్, ఫస్ట్ప్లోర్లో నాలుగు షెటర్లతో ఉన్న ఈ బిల్డింగ్ మొత్తం కొన్నేళ్లుగా గోదాంకు వినియోగిస్తున్నారు. ఇక్కడ 15 మంది వరకు పనిచేస్తుంటారు. శనివారం రాత్రి సిబ్బంది, వాచ్మెన్ విధులు ముగించుకొని ఎప్పటిలాగానే తాళం వేసి వెళ్లిపోయారు. అకస్మాత్తుగా మంటలు చెలరేగి లోపల ఉన్న సామగ్రి మొత్తం అంటుకున్నాయి. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో గమనించలేదు. ఆదివారం తెల్లవారుజామన స్థానికులు కొందరు బిల్డింగ్ నుంచి పొగలు రావడం చూసి పోలీసులు, గోదాంలో పనిచేసేవారికి సమాచారం అందించారు. ఉదయం 5 గంటల సమయంలో పోలీసులు వచ్చి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా అదుపులోకి రాకపోవడంతో షాద్నగర్ నుంచి మరో ఫైర్ ఇంజన్ను పిలిపించారు. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేశారు. అప్పటికే రెండు ఫ్లోర్లలో ఉన్న సామగ్రి మొత్తం కాలి బూడిదైంది. కంపెనీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు రూ.5 కోట్ల మేర నష్టం జరిగిందని తెలిపారు. షార్ట్సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విశ్లేషిస్తున్నట్లు సీఐ భూపాల్శ్రీధర్ తెలిపారు.


