సెకండ్‌ ‘హ్యాండ్‌’ ! | - | Sakshi
Sakshi News home page

సెకండ్‌ ‘హ్యాండ్‌’ !

Aug 21 2025 10:22 AM | Updated on Aug 21 2025 10:22 AM

సెకండ్‌ ‘హ్యాండ్‌’ !

సెకండ్‌ ‘హ్యాండ్‌’ !

అద్దెకు తెచ్చి.. ఫేక్‌ నంబర్‌ తయారు చేసి

మోసగాళ్లు తెలివిమీరుతున్నారు. జనాన్ని మోసం చేసి ఈజీగా మనీ సంపాదించడం కోసం కొత్తదారులు వెతుక్కుంటున్నారు. కార్లను అద్దెకు తీసుకుని, ఫేక్‌ నంబర్లు, ఆర్సీ తయారు చేసి ఆన్‌లైన్‌ ద్వారా విక్రయిస్తున్నారు. అదే కారును తస్కరించి, తిరిగి యజమానులకు అప్పగిస్తున్నారు. ఈ ముఠాను మాచారెడ్డి పోలీసులు పట్టుకున్నారు. బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ రాజేశ్‌ చంద్ర ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రానికి చెందిన ఉప్పల్వాయి ప్రశాంత్‌ గౌడ్‌ ఫేస్‌బుక్‌ అప్లికేషన్‌లో చూసి సెకండ్‌ హ్యాండ్‌ కారును కొనుగోలు చేశాడు. ఆ మరుసటి రోజు ఓ వ్యక్తి వచ్చి అది తన కారని చెప్పి తీసుకుపోయాడు. కారు విక్రమయించిన వ్యక్తులకు ఫోన్‌ చేయగా.. అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయన గతనెల 7వ తేదీన మాచారెడ్డి పీఎస్‌లో ఈ విషయమై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపగా కొత్త రకం మోసం వెలుగు చూసింది. కొందరు ముఠాగా ఏర్పడి సెకండ్‌ హ్యాండ్‌ కార్ల విక్రయాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. నిందితుల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలించారు.

ముఠాగా ఏర్పడి..

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపీనగర్‌కు చెందిన మహమ్మద్‌ ఇయాజ్‌, వికారాబాద్‌లోని ఆలంపల్లికి చెందిన మహమ్మద్‌ జాహీద్‌ అలీ, సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురానికి చెందిన పృధ్వి జగదీష్‌, రాచర్ల శివకృష్ణ, వేములవాడకు చెందిన వివేక్‌, శేరిలింగంపల్లి మండలానికి చెందిన కర్ణకోట సాకేత్‌, అలీ కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరు ముందుగా ట్రావెల్స్‌ సంస్థల నుంచి వ్యక్తిగతంగా ఇచ్చే సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లను అద్దెకు తీసుకుంటారు. వాటి నంబర్‌ ప్లేట్‌లు మార్చేసి నకిలీ ఆర్‌సీ, ఇతర పత్రాలు సృష్టిస్తారు. అనుమానం రాకుండా నకిలీ ఆర్‌సీ తయారు చేయడానికి ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లలో ఖాళీ మైక్రో సిమ్‌ కార్డులు, ఖాళీ చిప్‌ కార్డులను కొంటారు. వాటిపై పేర్లు, వివరాలను ప్రింటింగ్‌ చేస్తారు. అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి ఇతర పత్రాలన్నీ తయారు చేస్తారు. ఆపై ఫేస్‌బుక్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో కారు అమ్మకానికి ఉందని పెట్టి, తక్కువ ధరకే వాటిని అమ్మనున్నట్లు పేర్కొంటారు. కారు, చౌక ధరను చూసి ఆకర్షితులైనవారు వారి వలలో చిక్కుతున్నారు.

ట్రాకర్లను అమర్చి చోరీ..

కారును అమ్మేటప్పుడు దాంట్లో జీపీఎస్‌ ట్రాకర్‌ను అమరుస్తారు. దీంతో కారు ఎక్కడుందో వారికి తెలిసిపోతుంది. కారున్న చోటుకు వెళ్లి రాత్రికి రాత్రి వారు విక్రయించిన కారునే చోరీ చేసి తీసుకువచ్చి అసలు యజమానికి అప్పగిస్తున్నారు. అలా వీలు కాని సందర్భాల్లో ఇతరులను పంపి కారు మాది అంటూ బెదిరింపులకు పాల్పడి ఎత్తుకొస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని కారు అమ్మిన తర్వాత రెండు నుంచి మూడు రోజుల వ్యవధిలో పూర్తి చేస్తున్నారు.

నిందితులపై పలు కేసులు..

నిందితులు ఈ విధంగా గతంలోనూ పలు చోట్ల నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. శంకర్‌పల్లి, మంచాల, అంబారిపేట, రామచంద్రాపురం, చందానగర్‌, మియాపూర్‌, అత్తాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లలో నిందితులపై పలు కేసులు నఉన్నాయని ఎస్పీ రాజేశ్‌ చంద్ర తెలిపారు. మాచారెడ్డిలో కేసు నమోదైన నాటి నుంచి పరారీలో ఉన్న వారిలో ఆరుగురిని అరెస్ట్‌ చేశామన్నారు. వారిని బుధవారం రిమాండ్‌కు తరలించామన్నారు. మరో నిందితుడు అలీ ఇంకా పరారీలో ఉన్నాడన్నారు. నిందితుల వద్ద నుంచి మూడు కార్లు, 15 సెల్‌ఫోన్‌లు, జీపీఎస్‌ పరికరాలు, ల్యాప్‌టాప్‌, 10 మైక్రో సిమ్‌కార్డులు, చిప్‌ కార్డులు, ఫోర్జరీ చేసిన ఆర్‌సీలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు ఛేదనలో విశేషంగా కృషి చేసిన రూరల్‌ సీఐ రామన్‌, ఎస్సై అనిల్‌, ఐటీ సెల్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌, సిబ్బంది సుభాష్‌రెడ్డి, సిద్దిరాములు, శ్రీకాంత్‌లను అభినందించారు. సమావేశంలో కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి, అధికారులు పాల్గొన్నారు

ఫేస్‌బుక్‌ ద్వారా తక్కువ ధరకు విక్రయం

ఆపై అదే కారును చోరీ చేసి..

యజమానికి అప్పగింత

ముఠా గుట్టురట్టు చేసిన

మాచారెడ్డి పోలీసులు

ఆరుగురు నిందితుల అరెస్ట్‌,

పరారీలో మరొకరు

వివరాలు తెలిపిన ఎస్పీ రాజేశ్‌ చంద్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement