పుష్కరిణిలో మునిగి మహిళ మృతి
యాలాల: ప్రమాదవశాత్తు ఆలయ పుష్కరిణిలో మునిగి మహిళ మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని జుంటుపల్లి రామస్వామి ఆలయ సమీపంలో జరిగింది. ఎస్ఐ అరవింద్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బొంరాస్పేట మండలం తుంకిమెట్ల గ్రామానికి చెందిన నల్ల భీమమ్మ(40) రేగడి మైలారానికి చెందిన తన చెల్లెలు సత్యమ్మతో కలిసి జుంటుపల్లి జాతరకు వచ్చారు. గురువారం రాత్రి ఆలయ ఆవరణలో బస చేసిన వారు శుక్రవారం ఉదయం ఆలయ పుష్కరిణిలో స్నానమాచరించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు భీమమ్మ పుష్కరిణిలో పడింది. చెల్లెలు ఈ విషయాన్ని గమనించి కేకలు వేయడంతో స్థానికులు రక్షించేందుకు గాలించారు. చాలా సేపటికి భీమమ్మను బయటికి తీసి తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే భీమమ్మ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
జుంటుపల్లి జాతరలో విషాదం