గ్రీన్హౌస్ పర్యావరణాన్ని నియంత్రించేరోబోట్
మానవ రహిత టాయ్లెట్ క్లీనింగ్
జిల్లాకు చెందిన చిన్నారులు తమ మేధస్సుకు పదును పెట్టి రూపొందించిన నమూనాలు జాతీయ స్థాయికి ఎంపికయ్యాయి. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో లభించిన కఠిన శిక్షణ, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తాము ఏకాగ్రతతో నమూనాలు రూపొందించడం వల్లే విజయం సాధ్యమైందని చిన్నారులు చెబుతున్నారు. భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశానికి సేవ చేస్తామని సగర్వంగా చెబుతున్నారు.
తిరుపతి ఎడ్యుకేషన్ : ఓ చిన్ని ఐడియా జీవితాన్నే మార్చివేస్తుందన్నట్టు విద్యార్థుల్లో మొలకెత్తే ఆలోచనలకు పదును పెట్టిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం విద్యార్థులతో అడుగులు వేయిస్తోంది. ప్రతి ఏటా ఇన్స్పైర్ పేరుతో విద్యార్థులతో ప్రాజెక్టులు తయారుచేయిస్తోంది. వీటిలోని ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేసి వారిని ఆర్థికంగా, విద్యాపరంగా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా 2023–2024 విద్యా సంవత్సరం, 2024–2025 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రస్థాయి ప్రదర్శనను ఆన్లైన్ ప్రాతిపదికన నిర్వహించారు. ఇందులో 2023–24కు సంబంధించి 3 ప్రాజెక్టులు, 2024–25కు సంబంధించి 2 ప్రాజెక్టులు, మొత్తం 5 ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపికై నట్లు ఇటీవలే ప్రకటించారు.
వ్యక్తిగత, పబ్లిక్ టాయ్లెట్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడం, దుర్వాసనను నివారించడం, టాయ్లెట్ల నుంచి వ్యాపించే వ్యాధులను నివారించడమే ఆటోమేటిక్ టాయ్లెట్ ఫ్లషింగ్ సిస్టం ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్టును వరదయ్యపాళెం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని ఎం.గౌతమి గైడ్ టీచర్ ఎం.సుబ్బరామయ్య మార్గనిర్దేశంతో రూపొందించింది. 2024–25విద్యా సంవత్సరానికి సంబంధించి జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపికయ్యింది. మానవ రహిత టాయ్లెట్ క్లీనింగ్ ద్వారా టాయ్లెట్కు వెళ్లిన ప్రతిమారు చేతితో ఫ్లష్ను నొక్కాల్సిన అవసరం ఉండదు. ఈ సిస్టంను వ్యక్తిగత, పబ్లిక్ టాయ్లెట్స్తోపాటు పాఠశాలలు, రైళ్లు, బస్టాండ్లలో ఉపయోగించడం ద్వారా టాయ్లెట్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంటూ దుర్వాసన రాకుండా ఉండడంతో పాటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉంటుంది. ఈ సిస్టం తక్కువ నీటిని వినియోగించుకోవడంతో నీటిని ఆదా చేసుకోవచ్చు.
గ్రీన్హౌస్ వాతావరణ నియంత్రణ రోబోట్ వర్కింగ్ మోడల్ను తిరుపతిలోని సెవెన్ హిల్స్ హైస్కూల్ విద్యార్థిని ఎస్.విజయసాయి గైడ్ టీచర్ డి.భువనేశ్వరి పర్యవేక్షణలో రూపొందించింది. 2023–2024 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ ప్రాజెక్టు జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపికయ్యింది. ఈ పరికరంలో ఏర్పాటుచేసిన వివిధ సెన్సార్లు వాతావరణంలోని ఉష్ణోగ్రత, తేమ, కాంతి తీవ్రత, నేలలోని తేమ వంటి కీలకమైన వాతావరణ, నేల పారా మీటర్లను పర్యవేక్షిస్తుంది. అలాగే వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ నమోదు చేస్తుంది. ఈ పరికరం గ్రీన్హౌస్ వాతావరణాన్ని నియంత్రించేందుకు అనువుగా రూపొందించారు. తద్వారా వాతావరణంలో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ అందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని వాతావరణ సమతుల్యత చేపట్టవచ్చు.


