● రేణిగుంటలో టౌన్ బ్యాంక్ బ్రాంచ్ ప్రారంభించడం అభినందనీయం ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి
రేణిగుంట: తిరుపతి కో–ఆపరేటివ్ బ్యాంక్ రేణిగుంటలో ఏర్పాటు చేసిన నూతన బ్రాంచ్ను బుధవారం వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 40 ఏళ్లల్లో ఎన్నడూ లేనంతగా ప్రస్తుత పాలకవర్గం చేస్తున్న అభివృద్ధి అభినందనీయమన్నారు. తిరుపతి కో–ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రేణిగుంటలో నూతన బ్రాంచ్ను ఏర్పాటు చేయడం ఓ మైలురాయి అన్నారు. ఈ పాలకవర్గం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాజకీయాలకు అతీతంగా బ్యాంక్ అభివృద్ధే లక్ష్యంగా, ఖాతాదారులకు విశేష సేవలందించడమే పరమావధిగా పనిచేస్తున్నారన్నారు. 40ఏళ్ల తర్వాత బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి కృషితో నూతన బ్రాంచ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దాంతోపాటు రూ.47కోట్ల బకాయిల్లో రూ.43 కోట్లు వసూలు చేయడంలోనూ, ఖాతాదారులకు డివిడెంట్లు ఇప్పించడంలోనూ పాలకవర్గం, అధికారులు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. బ్యాంక్ అభివృద్ధికి కృషి చేస్తున్న అధికారులు, పాలకవర్గం, సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 29 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 71,297 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 32,783 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.5.59 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.


