తిరుపతి మంగళం : తిరుపతికి అత్యంత సమీపంలోని మంగళం ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపించినా వేసేయ్ పాగా అన్నట్లుగా కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. రికార్డులను సృష్టించి ప్రభుత్వ భూములను ఆక్రమించుకునేందుకు తెగబడుతున్నారు. ఈ క్రమంలోనే తిరుపతి అర్బన్ మండలం మంగళం తిరుమలనగర్ పంచాయతీ సర్వే నంబర్ 226లోని ప్రభుత్వ స్థలంలో కొందరు ఆక్రమణదారులు రాత్రికి రాత్రే పునాదులు నిర్మించేశారు. సుమారు రూ.కోటి విలువ చేసే 50 అంకణాల స్థలంలో ఏకంగా ఇల్లు నిర్మించేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు బుధవారం అక్రమ నిర్మాణాలను అడ్డుకున్నారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలని చూస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తహసీల్దార్ సురేష్బాబు హెచ్చరించారు. మరోసారి ఆ స్థలంలో ఆక్రమణలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు.


