● మూలన పడేసిన కూటమి ప్రభుత్వం ● రూ.2 కోట్లకుపైగా వృథా
తిరుపతి తుడా: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతిలో విశాలవంతమైన రోడ్లను అభివృద్ధి చేశారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కనెక్టివిటీ పెంచారు. ఆపై స్థానికులతో పాటు యాత్రికులకు సరికొత్త అనుభూతిని కలిగించేందుకు నగరంలో తొలిసారిగా డబుల్ డెక్కర్ ఎలక్ట్రికల్ బస్సును ప్రవేశపెట్టారు. ఆధ్యాత్మిక నగర అందాలను తిలకించేందుకు నగర ప్రజలు సైతం ఉత్సాహం చూపారు. నగరపాలక సంస్థ ఈ డబుల్ డెక్కర్ ఈవీ వెహికల్ నడిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. అప్పటి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్రెడ్డి ఆలోచనకు అనుగుణంగా మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసి ఈ బస్సును రెండు కోట్లు వేచించి కొనుగోలు చేశారు. కొన్నాళ్ల పాటు సాఫీగా తిప్పారు. ఇంతలో కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో రాజకీయ కక్ష సాధింపులో భాగంగా లక్ష్యాన్ని నీరుగార్చేశారు. ఆ బస్సును మూలన పడేశారు. డబుల్ డెక్కర్ బస్సు వినాయక సాగర్ మున్సిపల్ కార్పొరేషన్ డంపింగ్ పాయింట్లో తుప్పు పడుతోంది.
రాజకీయ కుట్రతోనే
కూటమి ప్రభుత్వ ఏర్పడిన మరుసటి రోజు నుంచి కూటమి నాయకుల కన్ను డబుల్ డెక్కర్ బస్సుపై పడింది. గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు దూరం చేయాలనే కుట్రతో బస్సును ఆపేందుకు ప్రయత్నించి సఫలమయ్యారు. నగర వాసుల నుంచి ప్రజాల సంఘాల నుంచి వ్యతిరేకత ఎదురైనా లెక్క చేయకుండా రాజకీయ కుట్రతో గత ప్రభుత్వ హయాంలో కొనుగోలు చేసి ప్రజా ఆస్తిని నిర్వీర్యం చేశారు. ప్రస్తుతం డబుల్ డెక్కర్ బస్సును వినాయక సాగర్లోని చెత్త డంపింగ్ పాయింట్ వద్ద ఉంచడంతో తుప్పు పడుతోంది.
ఆకట్టుకున్న డబుల్ డెక్కర్
జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలను అనుసరిస్తూ ఉత్పత్తయ్యే చెత్త నిర్వహణ మొదలు.. ప్లాస్టిక్ నిషేధం, ఉద్యోగులకు వంద ఈ స్కూటర్లు, పచ్చదనం పెంపు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి వంటి వాటిని విజయవం తంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఎలక్ట్రికల్ బ్యాటరీ బస్సును నడపాలని నిర్ణయించింది. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకోవడం, నగర వాసులకు కొత్త అనుభూతిని తీసుకురావడమే లక్ష్యంగా మోడ్రన్ బ్యాటరీ బస్సును ఏర్పాటు చేశారు. కరకంబాడి రోడ్డు అన్నమయ్య ఇంజినీరింగ్ కళాశాల, శ్రీపద్మావతి మహిళా వర్సిటీ, మంగళం, లీలామహల్ కూడలి, పూర్ణకుంభం సర్కిల్, రామానుజకూడలి, లక్ష్మీపురం, అన్న మయ్యసర్కిల్, ఎమ్మార్పల్లి కూడలి నుంచి నూతనంగా నిర్మించిన సీతమ్మ రోడ్డు మీదుగా నగరంలోని ప్రధాన కూడళ్లలో కొన్ని రోజుల పాటు నగర వాసులను, పలు రాష్ట్రాల నుంచి విచ్చేసిన భక్తులను ఆకట్టుకుంది. ప్రతి రోజూ విద్యార్థులు, ఉద్యోగులు, భక్తులు వందల సంఖ్యలో ప్రయాణించి సంతోషం వ్యక్తం చేశారు.


