నర్సింగ్ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలి
తిరుపతి తుడా: నగరంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం దారుణమని, వెంటనే ఆ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు బుధవారం నర్సింగ్ కళాశాల ఎదుట మృతుని తల్లిదండ్రులతో కలసి విద్యార్థి సంఘాల నేతలు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఇదే కళాశాల చైర్మన్ విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించే వాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తమను లైంగికంగా హింసించే వాడని అనేకసార్లు విద్యార్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బుధవారం అదే కళాశాలలో నర్సింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న సూళ్లూరు పేటకు చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కళాశాల యాజమాన్యం వేధింపులేనన్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యా ర్థిని సైతం శారీరకంగా కలవాలని హింసించేవాడని ఆమె తన తల్లిదండ్రులకు పలుసార్లు మొరపెట్టుకుందని మండిపడ్డారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కన్నా అధిక ఫీజులు వసూలు చేస్తూ కట్టని వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ బూతులు తిట్టేవారన్నారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు బండి చలపతి, ప్రవీణ్, చిన్న, హరి, వినయ్, సురేష్, అశోక్, ఎన్ఎస్యూఐ నాయకులు మల్లికార్జున, బాలాజీ, నల్సా నాయకులు సుందర్ పాల్గొన్నారు.


