బోధనేతర సిబ్బంది వర్సిటీకి వెన్నెముక
తిరుపతి సిటీ: యూనివర్సిటీకి బోధనేతర సిబ్బంది వెన్నెముకతో సమానమని, విద్యార్థులకు సంస్థకు సేవ చేయడం దైవంతో సమానమని వీసీ టాటా నర్సింగరావు పేర్కొన్నారు. రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రుసా సహకారంతో వర్సిటీలో బోధనేతర సిబ్బందికి వృత్తి నైపుణ్యంపై నెల రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమం గురువారం సెనేట్ హాల్లో ప్రారంభభమైంది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ బోధనేతర సిబ్బందికి శిక్షణ కార్యక్రమం ఒక సాధారణ పరిపాలనా వ్యాయామం కాదని, పారదర్శకత, జవాబుదారీతనం, సేవాతత్పరత బలోపేతం చేయడానికి ఉద్దేశించిందన్నారు. ఉద్యోగులు అడ్మిషన్లు, పరీక్షలు, స్కాలర్షిప్లు, జీతం, ఆడిట్లు, డిజిటల్ రికార్డులు, ఫిర్యాదుల పరిష్కారం వంటివి విషయాలను నైపుణ్యంతో చేయాల్సి ఉంటుందన్నారు. రెక్టార్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, వర్సిటీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఎస్వీయూ నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, శ్రీధర్, సుబ్రమణ్యం పాల్గొన్నారు.


