సైన్స్ సెంటర్లో బయోమిమిక్రీ గ్యాలరీ
తిరుపతి ఎడ్యుకేషన్: తిరుపతిలోని రీజనల్ సైన్స్ సెంటర్లో ప్రకృతి స్ఫూర్తితో సైన్స్ అనే థీమ్తో నూతనంగా ఏర్పాటు చేసిన బయోమిమిక్రీ గ్యాలరీని మంగళవారం ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐసర్) డైరెక్టర్ ప్రొఫెసర్ శాంతను భట్టాచార్య హాజరై గ్యాలరీని ప్రారంభించారు. వివిధ పాఠశాలల నుంచి హాజరైన విద్యార్థులతో కలిసి గ్యాలరీలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను తిలకించారు. తిరుపతి సర్కిల్ అటవీ అధికారి సి.సెల్వం, బెంగళూరుకు చెందిన విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం(వీఐటీఎం) డైరెక్టర్ సాజు భాస్కరన్, సైన్స్ సెంటర్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ కె.శ్రీనివాస నెహ్రూ, ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎన్టీ పురుషోత్తమ, భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణరాజు పాల్గొన్నారు.
పీఆర్ఎస్ఐ తిరుపతికి
బెస్ట్ ప్రోగ్రామ్స్ అవార్డు
తిరుపతి అన్నమయ్యసర్కిల్: పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా(పీఆర్ఎస్ఐ) తిరుపతి చాప్టర్కు జాతీయ స్థాయిలో బెస్ట్ ప్రోగ్రామ్స్ అవార్డు లభించింది. ఈ అవార్డును టీటీడీ చీఫ్ పీఆర్ఓ డాక్టర్ టి.రవి చేతుల మీదుగా మంగళవారం చాప్టర్ చైర్మన్ డాక్టర్ జీఎస్.ప్రసాద్, కార్యదర్శి దుద్యాల చంద్రమోహన్, ఇతర కార్యవర్గ సభ్యులు అందుకున్నారు. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇటీవల ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పీఆర్ఎస్ఐ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ అజిత్ పాథక్, సెక్రటరీ జనరల్ డాక్టర్ పీఎల్కే మూర్తి, వైస్ ప్రెసిడెంట్ (సౌత్) యుఎస్.శర్మ కలిసి తిరుపతి చాప్టర్కు బెస్ట్ చాప్టర్ అవార్డును ప్రకటించారు. సీపీఆర్ఓను పీఎస్ఆర్ఐ తిరుపతి చాప్టర్ కార్యవర్గ సభ్యులు మెమెంటో, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఎస్ఆర్ఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు కె.శ్రీనివాసరావు, కోశాధికారి కె.మధుసూదన్, జాయింట్ సెక్రటరీ సంస్కార్ రాజేష్, కార్యవర్గ సభ్యులు డాక్టర్ సి.స్వరాజ్యలక్ష్మి, వివి.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
దేశీయ పద్ధతిలో చెరకు సాగు పరిశీలన
తిరుపతి రూరల్: వేమూరు గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ సాగు రైతు అయ్యప్పనాయుడు పొలంలో కొత్తరకం చెరకు(16టి7) రకాన్ని దేశీయ పద్ధతిలో సాగు చేస్తున్నాడు. ఆ విధానాన్ని మంగళవారం వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశీలించారు. పెరుమాళ్లపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఎం.రెడ్డికుమార్, బ్రీడింగ్ విభాగం శాస్త్రవేత్త ఠాగూర్, మండల వ్యవసాయ అధికారి సుబ్బారావు పరిశీలించారు. ప్రకృతి వనరులతో తయారు చేసిన ఎరువుల వాడకం, పంట సాగులో సరికొత్త పద్ధతులతో చెరకు పంట ఏపుగా పెరగడాన్ని గమనించిన శాస్త్రవేత్తలు వివరాలను రైతు ద్వారా తెలుసుకున్నారు.
ఏనుగుల బీభత్సం
– తుమ్మచేనుపల్లిలో పంటలు ధ్వంసం
భాకరాపేట: చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల పంచాయతీ పరిధిలోని తుమ్మచేనుపల్లి గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గ్రామానికి చెందిన రైతు లక్ష్మణ్రెడ్డి మామిడి తోటలోకి సోమవారం రాత్రి చొరబడిన ఏనుగులు పంటను పూర్తిగా ధ్వంసం చేశాయి. తోటలోని 30 మామిడి చెట్లు, 10 కొబ్బరి చెట్లు నేలమట్టం అయ్యాయి. దీంతో రైతు లక్ష్మణ్రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. సంబంధిత అధికారులు స్పందించి పంట నష్టం అంచనా వేసి పరిహారం అందజేయాలని, ఏనుగుల దాడులు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
సైన్స్ సెంటర్లో బయోమిమిక్రీ గ్యాలరీ
సైన్స్ సెంటర్లో బయోమిమిక్రీ గ్యాలరీ
సైన్స్ సెంటర్లో బయోమిమిక్రీ గ్యాలరీ


