మత్స్యకారుల సమస్యలపై పార్లమెంట్లో ప్రస్తావిస్తా..
– ఎంపీ గురుమూర్తి
తిరుపతి మంగళం: మత్స్యకారుల సమస్యలపై పార్లమెంట్లో ప్రస్తావిస్తానని ఎంపీ మద్దిల గురుమూర్తి అన్నారు. జిల్లాలోని పులికాట్ ప్రాంతంలో కొనసాగుతున్న అంతర్రాష్ట్ర జల వివాదం సమస్యను మత్స్యకారులు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు తిరుపతిలోని ఎంపీ కార్యాలయంలో మంగళవారం పులికాట్ ప్రాంత మత్స్యకారులు ఎంపీ గురుమూర్తిని కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని సుమారు 24 గ్రామాల మత్స్యకారులకు పులికాట్ సరస్సు, దాని పరిసర తీర ప్రాంతాల్లో చేపల వేటే ప్రధాన జీవనాధారమని, అందులో ఐదు గ్రామాలు పూర్తిగా చేపల వేటాడే వృత్తిపైనే ఆధారపడి ఉన్నాయని వారు ఎంపీకి వివరించారు. పన్నంగాడు ప్రాంతంలో ఉన్న పులికాట్ సరస్సు పబ్లిక్ పులికాట్ మ్యాప్స్ ప్రకారం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోనే ఉందని, ఈ ప్రాంతం అంతర్రాష్ట్ర సరిహద్దుకు సుమారు 3.34 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ తమిళనాడు రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు సరిహద్దులు మార్చేశారని, అందువలన చేపల వేట కొనసాగించడం సమస్యగా మారిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తరచూ ఘర్షణలు చోటుచేసుకుంటూ, స్థానిక మత్స్యకారులు భయభ్రాంతులకు గురవుతూ జీవనాధారం కోల్పోయే పరిస్థితి నెలకొందని ఎంపీకి తెలియజేశారు. ఈ సమస్యపై గతంలో పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడిన విషయాన్ని ఎంపీ గుర్తు చేశారు. ఈ విషయమై మరోసారి పార్లమెంటులో ప్రస్తావిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్తో మాట్లాడిన ఎంపీ గురుమూర్తి అక్రమ చొరబాట్లను అరికట్టి స్థానిక మత్స్యకారులకు రక్షణ కల్పించాలని, వారి సంప్రదాయ మత్స్యకార హక్కులను కాపాడేలా శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.


