
వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని యువకుడిపై దాడి
చెట్టుకు కట్టేసి కొట్టిన మహిళ కుటుంబ సభ్యులు
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి
నల్గొండ: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో మహిళ భర్త, ఆయన కుటుంబ సభ్యులు ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. దీంతో ఆ యువకుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నోముల గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నోముల గ్రామానికి చెందిన నర్సింగ్ జానయ్య(35)కు ఇంకా వివాహం కాలేదు. జానయ్యకు అదే గ్రామానికి చెందిన ఓ వివాహిత మహిళతో పరిచయం ఏర్పడి.. అది వివాహేతర సంబంధానికి దారితీసింది.
గతేడాది ఇదే విషయమై ఆ మహిళ కుటుంబ సభ్యులకు, జానయ్యకు మధ్య గొడవలు జరిగాయి. పలుమార్లు పెద్దమనుషుల మధ్య పంచాయితీలు కూడా నడిచాయి. ఇదే విషయంపై జానయ్యపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో అతడు జైలుకు వెళ్లి వచ్చాడు. జైలు నుంచి వచ్చాక కూడా జానయ్య ఆమెతో సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసి జానయ్యను అంతమొందించాలని ఆ మహిళ భర్త నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తన భార్యతోనే జానయ్యను శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి పిలిపించాడు. ఇంటికి వచ్చిన జానయ్య కళ్లలో కారం చల్లి.. కాళ్లు, చేతులు కట్టేసి ఆ మహిళతోపాటు ఆమె భర్త కర్రలతో చితకబాదారు.
అనంతరం మరికొందరితో కలసి ఇంటి పక్కన ఉన్న వీధిలో చెట్టుకు జానయ్యను తాళ్లతో కట్టేసి అతడి తల, కాళ్లు, చేతులు, మర్మాంగాలపై విచక్షణారహితంగా కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన జానయ్య అసస్మారకస్థితిలోకి వెళ్లాడు. చుట్టుపక్కల వారు గమనించి జానయ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి జానయ్యను నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. ఈ ఘటనపై జానయ్య తల్లి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు.