చివరి అడుగూ నీతోనే..
♦ అనారోగ్యంతో భార్య మృతి.. కొద్దిసేపటికే భర్త ఆత్మహత్య ♦ మృత్యువులోనూ వీడని బంధం ♦ నల్లగొండ జిల్లాలో విషాదం
చందంపేట: అనారోగ్య కారణాలతో భార్య మృతిచెందగా భార్య వియోగాన్ని భరించ లేని భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన నల్లగొండ జిల్లాలో బుధ వారం చోటుచేసుకుంది. చందంపేట మండ లం తెల్దేవర్పల్లి గ్రామానికి చెందిన ఎర్ర హనుమంతురెడ్డి (90), లక్ష్మమ్మ(82) దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. పిల్లలందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. పెద్ద కుమారుడు వెంకట్రెడ్డి ఆర్టీసీ ఉద్యోగిగా హనుమకొండలో ఉండగా మరో కుమారుడు నర్సింహారెడ్డి మిర్యాలగూడలో లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
కుమార్తె సత్తమ్మ పిల్లాపాపలతో గుర్రంపోడు మండలం కాల్వపల్లిలో నివసిస్తోంది. ఇటీవల లక్ష్మమ్మ అనారోగ్యం బారినపడటంతో రెండ్రోజుల క్రితం కుమార్తె వచ్చింది. కాగా, లక్ష్మమ్మకు ఆరోగ్యం క్షీణించి మంగళవారం రాత్రి కన్నుమూసింది. భార్య మృతిని తట్టుకోలేని భర్త హనుమంతురెడ్డి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అతడిని దేవరకొండ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున మృతిచెందాడు.