దివ్యాంగుల సంక్షేమ బడ్జెట్‌ 75 రెట్లు పెంచాం | We have increased the welfare budget of the disabled by 75 times | Sakshi
Sakshi News home page

దివ్యాంగుల సంక్షేమ బడ్జెట్‌ 75 రెట్లు పెంచాం

Jun 28 2024 4:17 AM | Updated on Jun 28 2024 4:17 AM

We have increased the welfare budget of the disabled by 75 times

5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయం

హెలెన్‌ కెల్లర్‌ జయంతి కార్యక్రమంలో మంత్రి సీతక్క  

సాక్షి, హైదరాబాద్‌/చాదర్‌ఘాట్‌/గన్‌ఫౌండ్రీ: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభు త్వం ఏర్పాటైన తర్వాత వికలాంగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. గురువారం మలక్‌పేటలోని వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయ ఆవరణలో హెలెన్‌ కెల్లర్‌ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం హెలెన్‌ కెల్లర్‌ జయంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపుల్లో భాగంగా రూ.కోటి మాత్రమే కేటాయిస్తే... కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.75 కోట్లు కేటాయించిందన్నారు. గత ప్రభుత్వ కేటాయింపులతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం 75రెట్లు అధికంగా కేటాయింపులు జరిపిందన్నారు. అదేవిధంగా ఉన్న త విద్యా సంస్థల్లో దివ్యాంగులకు కనీసం 5శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, వయో పరిమితి కూడా ఐదేళ్లు పెంచిందన్నారు. 

తమ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు, ఉద్యాగాల కల్పనలో 4 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. అనంతరం తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన రోజే రజినికి ఉద్యోగం ఇచ్చారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మహిళాభివృద్ధి, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, వికలాంగుల సంక్షేమ శాఖ సంచాలకులు బి.శైలజ తదితరులు పాల్గొన్నారు. 

దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. 
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి సీతక్క అన్నారు. గురువారం రవీంద్రభారతిలో దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హెలెన్‌ కిల్లర్‌ 144వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... వికలాంగులను బాధ్యతగా చూడలేనివారు, వికలాంగులను స్వార్థ ప్రయోజనాలకోసమే వాడుకునేవారు నిజమైన వికలాంగులన్నారు. అనంతరం దివ్యాంగుల కోసం వివిధ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి పరికరాల గురించి అడిగి తెలుసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement