
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్లో(LBnagar) థార్ వాహనం బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో డ్రైవర్ అతివేగంతో వాహనాన్ని నడిపి వరుస ప్రమాదాలకు కారణమయ్యాడు. ఈ ప్రమాద ఘటనలో మొత్తం ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. బీఎన్రెడ్డినగర్(BNReddy Nagar) సమీపంలోని గుర్రంగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇంజాపూర్ నుంచి గుర్రంగూడ వైపు వేగంగా దూసుకొచ్చిన థార్ వాహనం(Thar Road Accident) అదుపు తప్పింది. అనంతరం, మొదట రోడ్డుపై వెళ్తున్న ఓ బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ సందర్భంగా ఆ బైక్పై ప్రయాణిస్తున్న విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. సదరు విద్యార్థిని సిరిసిల్లకు చెందినట్టు తెలిసింది. దీంతో, వెంటనే ఆమెను మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: జూబ్లీహిల్స్ బరిలో ఎవరు.. ఇద్దరిలో అవకాశం ఎవరికి?
ఇక, వాహనం ఎక్కువ వేగంతో ఉండటంతో డివైడర్ను దాటుకుని ఎదురుగా వస్తున్న మరో కారును ఢీ కొట్టింది. ఆ తర్వాత వాహనం గాల్లోకి లేచి మూడు పల్టీలు కొట్టి రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో థార్ వాహనంలో ఉన్న డ్రైవర్తో పాటు యజమాని అనిరుధ్కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే, రెండో కారులో ప్రయాణిస్తున్న దినేష్, శివ అనే ఇద్దరు వ్యక్తులు కూడా గాయపడ్డారు. దీంతో, వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
