సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో ఈ ఉదయం ఘోరం జరిగింది. కారు పూజ కోసం వచ్చిన ఓ కుటుంబంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఆ ఇంటి పెద్ద అదే కారు కింద పడి అనూహ్యరీతిలో మృతిచెందారు.
మేనల్లుడి కారు పూజ కార్యక్రమం కోసం రామచంద్రరావు(70) అనే వ్యక్తి తన బంధువులతో పెద్దమ్మ గుడికి వచ్చారు. పూజ కార్యక్రమం పూర్తయిన తర్వాత కారును అక్కడి నుంచి తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రామచంద్రరావు మేనల్లుడు పొరపాటున యాక్సిలరేటర్ను తొక్కడంతో వాహనం ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో సమీపంలో ఉన్న ఆయన కారు కింద చిక్కుకుని గాయపడ్డారు.
తీవ్ర గాయాలపాలైన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశారు. పెద్దమ్మ గుడి వద్ద నిత్యం కొత్త వాహనాలకు పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. అయితే ఏనాడూ ఇలాంటి ఘటన జరగలేదని నిర్వాహకులు చెబుతున్నారు.
ఆలయ ప్రాంగణంలోనే ఈ ఘటన జరగడంతో అక్కడ విషాదం నెలకొంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి స్వస్థలం.. ఇలా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: జాబ్ వస్తుందన్న ఆనందం అంతలోనే..


