ఏఐలో మరో విప్లవం | New job opportunities for engineering students | Sakshi
Sakshi News home page

ఏఐలో మరో విప్లవం

Aug 29 2026 5:54 AM | Updated on Aug 29 2026 5:54 AM

New job opportunities for engineering students

ఇంజనీరింగ్‌ విద్యార్థులకు సరికొత్త ఉద్యోగాలు

సమస్యల సాధన దిశగా ఫార్వర్డ్‌ డిప్లాయిడ్‌ ఇంజనీర్లు

ఏఐ ఎంఎల్, డేటాసైన్స్‌కు అడ్వాన్స్‌డ్‌ ప్రోగ్రామ్‌

తొమ్మిది ప్రోగ్రామ్స్‌పై పట్టు ఉంటేనే ఉజ్వల భవిత

ఏఐ కంపెనీలకు కీలకంగా మారబోతున్న ఎఫ్‌డీఈ ఉద్యోగాలు

సాక్షి, హైదరాబాద్‌ : వేగంగా దూసుకెళుతున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌.. మరో కొత్త ఉద్యోగ విప్లవాన్ని తీసుకొస్తోంది. కొంతకాలంగా ఏఐలో ఫార్వర్డ్‌ డిప్లాయిడ్‌ ఇంజనీర్ల (ఎఫ్‌డీఈ) ప్రాధాన్యం పెద్ద ఎత్తున పెరిగింది. ఇప్పటి వరకూ కార్పొరేట్‌ సంస్థల్లో కూర్చుని పనిచేసే ఉద్యోగాలే చూశాం. ఏఐ కస్టమర్‌ సంస్థలకు వెళ్లి, వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకొని, ఏఐ వల్ల ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడమే ఎఫ్‌డీఈ ఉద్యోగాల ప్రత్యేకత. సమస్యను గుర్తించడం నుంచి కోడింగ్, సిస్టమ్‌ ఇంటిగ్రేషన్, టెస్టింగ్, ప్రొడక్షన్‌లో అమలు వరకు మొత్తం ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యత తీసుకోవాలి. ఏఐ రంగంలో దీన్ని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌+కన్సల్టింగ్, ప్రొడక్ట్‌ డిప్లాయ్‌మెంట్‌గా భావిస్తారు. ఏఐ వాడకంలో అనేక సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో లాస్ట్‌మైల్‌ వరకూ ఏడీఈలు పరిష్కారం చూపిస్తారు.

ఎఫ్‌డీఈ బూమ్‌... అధ్యయనాల వెల్లడి..: ఏఐ శిక్షణ సంస్థ ఆంటోలాజైజ్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం.. 2026 చివరి నాటికి ఎఫ్‌డీఈ నైపుణ్యం గల ఉద్యోగుల సంఖ్య పెద్ద ఎత్తున ఉండొచ్చు. 1,311 సంస్థల్లో దాదాపు 2.39 లక్షల ఎఫ్‌డీఈ నిపుణుల అవసరం ఉంటుంది. గడచిన ఆరు నెలల్లో 519 సంస్థలు ఈ తరహా ఉద్యోగుల కోసం ఆఫర్లు ఇచ్చాయి.  2028 నాటికి వందశాతం ఎఫ్‌డీఈ ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందని ఐటీ సంస్థలు వెల్లడిస్తున్నాయి. టీసీఎస్‌ ఈ ఏడాది చివరి నాటికి 9 వేల మంది ఎఫ్‌డీఈ నిపుణుల అవసరం ఉంటుందని తన వార్షిక ప్రణాళికలో వెల్లడించింది.

 బిగ్‌డేటాతో ఏఐ వైపు మౌలిక వసతులు కల్పించుకుంటున్న 70 ప్రధాన సంస్థలు ఏఐ మోడల్స్‌ ఎంపిక, ప్రోటోటైప్, కోడింగ్, ఇంటిగ్రేషన్, భద్రత పరీక్షలు, ప్రొడక్షన్‌ అమలు వంటి వాటికి ఎఫ్‌డీఈ ఉద్యోగుల నియామకాన్ని కోరుకుంటున్నాయి. టెక్నాలజీ, సర్వీసెస్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ (టీఎస్‌ఐఏ) ఎఫ్‌డీఈ పాత్రపై లోతుగా అధ్యయనం చేసింది. ఏఐ వ్యవస్థ సాంకేతికంగా పనిచేస్తోంది. అయితే, సంస్థకు వాస్తవ వ్యాపార ప్రయోజనం అందడం లేదని టీఎస్‌ఏఐ గుర్తించింది. ఈ గ్యాప్‌ను భర్తీ చేయగలిగే వ్యవస్థ ఎఫ్‌డీఈలకే ఉంటుందని స్పష్టం చేసింది. 

ఎమర్జింగ్‌ కోర్సులకు ఆ నైపుణ్యం పెంచాలి..: కంప్యూటర్‌ సైన్స్, అనుబంధ ఎమర్జింగ్‌ కోర్సుల్లో అవసరమైన మార్పులు చేస్తేనే సరికొత్త ఏఐ ఉద్యోగాలు పొందే వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంజనీరింగ్‌లో ప్రధానంగా తొమ్మిది సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్స్‌పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. పైథాన్, జావా వంటి ప్రోగ్రామ్స్‌లో మెళకువలతోపాటు, ఎస్‌క్యూఎల్‌ డేటాబేస్‌పై పట్టు పెంచుకోవాలి. ఏపీఐలు, సిస్టమ్‌ ఇంటిగ్రేషన్‌పై ఇంజనీరింగ్‌ మొదటి ఏడాది నుంచే దృష్టి పెట్టాలి. క్లౌడ్‌ కంప్యూటింగ్‌పై ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవ్వాలి. మెషిన్‌ లెర్నింగ్, జనరేటివ్‌ ఏఐను నిత్యం పరిశీలించాలి. డేటా ఎనాలసిస్, సిస్టమ్‌ డిజైన్, సైబర్‌ సెక్యూరిటీ వంటి ఎమర్జింగ్‌ టెక్నాలజీపై పూర్తి పట్టు సాధించాలి. ఇంజనీరింగ్‌ కాలేజీలు ఈ దిశగా ముందుకెళ్తేనే రేపటి తరానికి ఎఫ్‌డీఈలు తయారవుతారని నిపుణులు సూచిస్తున్నారు.

కోడ్‌ ఒక్కటే లక్ష్యం కాకూడదు 
రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్‌ విద్యలో కోడ్‌ రాయడం ఒక్కటే లక్ష్యం కాకూడదు. వాస్తవ సమస్యను గుర్తించి, ఏఐతో పరిష్కరించి, దాన్ని ఉత్పత్తి స్థాయిలో అమలు చేయడం అలవర్చుకోవాలి. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులను గుర్తించాలి. అప్పుడే ఎఫ్‌డీఈ వంటి చాలెంజింగ్‌ ఉద్యోగాలు పొందే వీలుంటుంది. 
– సిద్ధిక్‌ రాథోడ్, ఏఐ సీనియర్‌ ఎనలిస్ట్, హైదరాబాద్‌

ఎఫ్‌డీఈకు మంచి డిమాండ్‌ ఉంది 
సర్వీస్, ప్రొడక్ట్‌ బేస్డ్‌ సంస్థలన్నీ బిగ్‌డేటా సెంటర్స్‌పై ఆధారపడుతున్నాయి. దాదాపు 90 శాతం ఏఐతో మమేకమయ్యాయి. అయితే, సాంకేతికత వినియోగంలో సమస్యలు వస్తున్నాయి. ఆన్‌లైన్‌ ద్వారా కాకుండా, కస్టమర్‌ సంస్థ వద్దకే వెళ్లి, అక్కడి సిబ్బందితో మమేకమ­య్యే వ్యవస్థను అన్ని సంస్థలూ కోరుకుంటున్నాయి. ఈ క్రమంలో ఎఫ్‌డీఈ ఉద్యోగాల సృష్టికి డిమాండ్‌ పెరుగుతోంది. 
– చోగన్‌ హస్లీ, యూఎస్‌లో ఏఐ సంస్థలో మేనేజర్‌   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement