ఇటీవల ప్రధాని మోదీ క్లాస్తో ఉలికిపాటు.. దిద్దుబాటలో రాష్ట్ర బీజేపీ
తెలంగాణ, ఏపీలో సోషల్ మీడియాలో బీజేపీ వీక్ అనే అభిప్రాయం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర నేతలకు కొత్త సమస్య వచ్చి పడింది. ఢిల్లీ జంతర్మంతర్ వద్ద జెన్–జీ ఆందోళనలు తదనంతర పరిణామాల నేపథ్యంలో నవ యువతరానికి దగ్గరయ్యేది ఎలా అన్న మీమాంస పట్టిపీడిస్తోందట. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని పార్టీ శాఖలు, సోషల్ మీడియా టీమ్లు యాక్టివ్గా పనిచేస్తున్నాయి. జెన్–జీకి దగ్గర కావాలని, నేటి తరంతో మమేకం కావాలని ప్రధాని మోదీ కూడా కమలం నేతలకు సూచించారు. అయితే బీజేపీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శాఖలు మాత్రం వెనుకబడ్డాయని పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
తెలంగాణ బీజేపీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ను ఆ పార్టీ అభిమానులే వ్యంగ్యోక్తులు, మీమ్లతో ట్రోలింగ్ చేసే పరిస్థితి కూడా ఎదురవుతోంది. బీజేపీ నేషనల్ టీమ్, ఇతర రాష్ట్రాల సోషల్ బృందాలతో పోల్చుతూ రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ నాయకులను ఉద్దేశించి హిందుత్వవాదుల వ్యంగ్యబాణాలు సంధిస్తుండడంలో అవాక్కు కావడం నేతల పనైంది.
‘మీకు చేతకాకపోతే చెప్పండి... మేమైనా మీకు కంటెంట్ ఇస్తాం’అన్నంత వరకూ విమర్శలు వెళ్లాయి. వివిధ రాష్ట్రాల బీజేపీ అకౌంట్స్ రాహుల్గాంధీని, ‘దిమాగీ నక్సల్స్’లక్ష్యంగా అగ్రెసివ్ పోస్టులు పెడుతూ సినిమా డైలాగులు, సినిమా సీన్లు, ఏఐ జనరేటెడ్ కంటెంట్ పెట్టి రచ్చరచ్చ చేస్తుంటే, రెండు రాష్ట్రాల వారు చేష్టలుడిగి మిన్నకుండిపోతున్నారనే దాడి తీవ్రస్థాయికి చేరుకుంటోంది.
దిద్దుబాటు చర్యల్లో రాష్ట్ర నేతలు
తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా టీమ్ మాత్రం బాగానే పోస్టింగ్లు పెడుతున్నామనే అభిప్రాయంతో ఉందట. అయితే పార్టీకి కాకుండా కొందరు లీడర్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఈ టీమ్పై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు కూడా యువత, విద్యార్థులకు దగ్గర అయ్యేందుకు కార్యాచరణ ప్రారంభించారు. పార్టీ అధ్యక్షుడు మొదలు వివిధ స్థాయిల నేతలు, అనుబంధ విభాగాలు కాలేజీ క్యాంపస్ల సందర్శన మొదలైంది.
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు, పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై పార్టీపరంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తున్నారు. ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో యువ క్రీడాకారులు, విద్యార్థులు ఖేలో ఇండియాకు సంబంధించిన కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్రెడ్డి హాజరయ్యారు. దీంతో దిద్దుబాటులో రాష్ట్రపార్టీ నిమగ్నమైందని, వివిధ అంశాలపై చురుగ్గా వ్యవహరించే ప్రయత్నాల్లో ఉన్నట్టు స్పష్టమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


