రాజకీయ రక్షాబంధన్‌! | Konda Surekha Ties Rakhi to CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

రాజకీయ రక్షాబంధన్‌!

Aug 29 2026 5:07 AM | Updated on Aug 29 2026 5:11 AM

Konda Surekha Ties Rakhi to CM Revanth Reddy

సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీ కడుతున్న మంత్రి సురేఖ. చిత్రంలో సీఎం సతీమణి గీత

సీఎం రేవంత్‌ నివాసానికి వెళ్లి రాఖీ కట్టిన మంత్రి సురేఖ  

భార్య, కుమార్తెకి బొట్టు పెట్టి.. రేవంత్‌తోపాటు ఆయన మనవడికీ రాఖీ

ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టి ఆశీస్సులు తీసుకున్న మంత్రి  

ఇద్దరి మధ్య రాజీకి సంకేతమా? పండుగ పూట ఇరువురూ హుందాగా వ్యవహరించారా?  

తాజా పరిణామాల నేపథ్యంలో ‘రక్షా బంధన్‌’పై ఆసక్తికర చర్చ  

నాపై ఆయన ఆశీస్సులు ఉంటాయి: మంత్రి సురేఖ

సాక్షి, హైదరాబాద్‌: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ఆత్మియ బంధానికి ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి ఈసారి రాజకీయంగా చర్చనీయాంశమైంది. దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ రాఖీ పండుగ సందర్భంగా శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లడం, ముఖ్యమంత్రితో పాటు ఆయన మనవడికి బంగారంతో ప్రత్యేకంగా చేయించిన రాఖీలు కట్టి ఆశీర్వాదం తీసుకోవడం తాజా రాజకీయ పరిణామాల్లో ఆసక్తికరంగా మారింది. మరో మంత్రి సీతక్కతో కలిసి సీఎం నివాసానికి వెళ్లిన ఆమె ముఖ్యమంత్రికి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.

సీఎంతో పాటు ఆయన సతీమణి గీత, కుమార్తె నైమిషాలకు బొట్టు పెట్టి, రేవంత్‌తో పాటు ఆయన మనవడికి కూడా రాఖీ కట్టారు. అయితే, రాఖీ కట్టేందుకు సీఎం నివాసానికి సురేఖ వెళ్లారన్న వార్తతో పాటు రాఖీ కట్టిన సందర్భంలోనూ, ఆ తర్వాత రేవంత్, సురేఖలిద్దరూ ఆత్మియంగా పలకరించుకోవడం, ఎక్కడా ఇద్దరి ముఖకవళికల్లో ఇబ్బంది కనిపించకపోవడంతో అసలేం జరుగుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఈ బంధం ఇలానే కొనసాగుతుందా? లేక బంధానికి త్వరలోనే గండి పడుతుందా? అన్న చర్చ జరిగింది.  

నువ్వొస్తానంటే నేనొద్దంటానా? 
వాస్తవానికి, ప్రతి రాఖీ సందర్భంగా సీఎం రేవంత్‌కు మంత్రి సురేఖ రాఖీ కడుతున్నారు. అయితే, ఇటీవల సురేఖ కుమార్తె సుస్మిత మాట్లాడిన మాటలు, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు సురేఖ, రేవంత్‌ల నడుమ రాజకీయ అగాధాన్ని ఏర్పరిచాయి. అసలు ఎదురుపడితే ఇద్దరూ మాట్లాడుకోగలరా? అనే స్థాయిలో రాజకీయ చర్చోపచర్చలు జరిగాయి. కానీ, రాఖీ పౌర్ణమి రోజున ఇద్దరూ హుందాగా వ్యవహరించి పండుగ ప్రత్యేకతను, సందేశాన్ని ప్రజలకు పంపడం గమనార్హం.

అయితే, అసలు సీఎం అపాయింట్‌మెంట్‌ తీసుకునే సురేఖ వెళ్లారా? కనీసం సమాచారమిచ్చారా? ఒకవేళ నిజంగానే సమాచారం అందిన మేరకు సురేఖతో రాఖీ కట్టించుకునేందుకు సీఎం అమోదించారా? తద్వారా రేవంత్‌ వర్సెస్‌ కొండా కుటుంబం అనే వివాదం విషయంలో రాజీ సంకేతాలను పంపాలనుకున్నారా? లేదంటే పండుగ పండుగే... చర్యలు చర్యలే.. అన్న ధోరణిలో ముందుకెళ్లారా? అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.  

నన్ను వేరుగా చూడకండి.. 
రాఖీ కట్టి సీఎం నివాసం నుంచి వెళ్లిపోయిన మంత్రి సురేఖ తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌కు రాఖీ కట్టి వచ్చానని, ఆయనకు ఆడపడుచులందరి దీవెనలు ఉంటాయని చెప్పారు. ఆయన సుపరిపాలన అందించాలని, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తి, యుక్తి ఆయనకు కలగాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్‌ ఆశీర్వాదం కూడా ఆడపడుచులందరిపై ఉండాలని కోరారు.

 ప్రపంచ వ్యాప్తంగా రాఖీ పండుగ జరుపుకుంటున్న అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముళ్లందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ రోజున రాజకీయాలు మాట్లాడదల్చుకోలేదని, మూడోసారి రేవంత్‌కు రాఖీ కట్టి వచ్చానని చెప్పారు. ఆడపడుచుల విషయంలో సురేఖను వేరు చేసి మాట్లాడవద్దని, గ్రామీణ ప్రాంత మహిళలతో పాటు తనపై కూడా ఆయన ఆశీస్సులు ఉంటాయని సురేఖ వ్యాఖ్యానించారు.  

కిటకిటలాడిన సీఎం నివాసం 
కాగా, రక్షాబంధన్‌ సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌ నివాసం కిటకిటలాడింది. రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ గద్వాల విజయలక్ష్మి, మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ అధ్యక్షురాళ్లు మొగిలి సునీత, నేరెళ్ల శారద, వైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ కల్వ సుజాత, బాలల హక్కుల కమిషన్‌ చైర్‌పర్సన్‌ సీతాదయాకర్‌రెడ్డి, రైతు కమిషన్‌ సభ్యురాలు భవానీరెడ్డి, బీసీ కమిషన్‌ సభ్యురాలు బాలలక్ష్మి, మాజీ ఎంపీ గుండు సుధారాణి, పీసీసీ నేతలు బొజ్జా సంధ్యారెడ్డి, ఇందిరా శోభన్, రేగులపాటి రమ్యారావు, పాల్వాయి రజనీకుమారి తదితరులతో పాటు పలు కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు, బ్రహ్మకుమారీలు, మలక్‌పేటలోని గవర్న్‌మెంట్‌ హైసూ్కల్‌ ఫర్‌ ది బ్లైండ్‌ గరల్స్‌ విద్యార్థినులు రేవంత్‌కు రాఖీలు కట్టారు.

నా ఎదుగుదలలో అండగా రేవంత్‌: మంత్రి సీతక్క 
సీఎం రేవంత్‌కు రాఖీ కట్టిన తర్వాత టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొజ్జా సంధ్యారెడ్డి తదితరులతో కలిసి మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. వామపక్ష భావజాలం నుంచి వచి్చన ఆదివాసీ బిడ్డగా తన ఎదుగుదలలో రేవంత్‌రెడ్డి అండగా ఉన్నారని, తను ఈ స్థాయికి రావడంలో ఆయన సహకారం చాలా ఉందని చెప్పారు. తనకున్న ఒక్క తోబుట్టువు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారని, అక్కా అంటూ తన వద్దకు వచి్చన వారందరినీ సోదరులుగా భావిస్తానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement