..లక్కీ హ్యాండ్..
రాజేంద్రనగర్ నియోజకవర్గం లక్ష్మీగూడలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ లక్కీ డ్రాను మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అక్కడే ఉన్న చిన్నారిని పిలిచి మొదటి డ్రా తీయించారు. విచిత్రంగా.. తన తల్లి పేరుతో ఉన్న చీటీనే ఆ బాలుడు తీయడంతో అక్కడ భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఓ చిన్నారి తన తల్లి పేరుతో ఉన్న చీటీనే తీయడం విశేషమని మంత్రి శ్రీనివాస్రెడ్డి అన్నారు. తల్లి సొంతింటి కలను చిన్నారి తన అదృష్టంతో నెరవేర్చాడంటూ ఆనందం వ్యక్తం చేశారు.
మైలార్దేవ్పల్లి: ఇందిరమ్మ టవర్స్తో పేదల సొంతింటి కల సాకారం కానుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం లక్ష్మీగూడలో శుక్రవారం క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ లక్కీ డ్రాను ప్రారంభించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా తొలిదశలో 4.50 లక్షల ఇళ్లు, రెండో దశలో మరో 2.50 లక్షల ఇళ్లు నిర్మించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. హైదరాబాద్ పరిధిలో పట్టణ పేదల కోసం ప్రత్యేకంగా లక్ష ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామని, తొలిదశ పైలెట్ ప్రాజెక్టుగా నాలుగు నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 480 ఇళ్ల చొప్పున నిర్మాణానికి టెండర్లు ఖరారయ్యాయని చెప్పారు.
మహిళల పేరుమీద రిజిస్ట్రేషన్
లబ్ధిదారుల కుటుంబంలోని మహిళ పేరు మీద ఇంటిని రిజిస్ట్రేషన్ చేస్తామని, రిజిస్ట్రేషన్ ఫీజు, ఇతర చార్జీలు కూడా ప్రభుత్వం భరిస్తుందని మంత్రి తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరుగుతుందన్నారు. రిజర్వేషన్ నిబంధనలను పాటిస్తూ బహిరంగ లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేపడుతున్నామని తెలిపారు. లక్కీ డ్రాలో పేరు వచ్చినంత మాత్రాన తుది కేటాయింపు జరిగినట్టు కాదని స్పష్టం చేశారు. అధికారులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి భౌతికంగా పరిశీలించి, పత్రాలు, అర్హతను ధ్రువీకరించిన అనంతరం తుది ఎంపిక, కేటాయింపు జరుగుతుందని తెలిపారు. ఒకసారి లక్కీ డ్రాలో పేరు రాకపోతే దరఖాస్తు ముగిసిపోయినట్టు కాదని, అర్హులైన వారికి తదుపరి దశల్లో కూడా అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు.
⇒ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ పేద ప్రజలకు సొంతిల్లు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. ఇల్లు లేని పేద కుటుంబాల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
⇒ హౌసింగ్ బోర్డు ఎండీ పీవీ గౌతమ్ మాట్లాడుతూ రాజేంద్రనగర్ నియోజకవర్గానికి కేటాయించిన 480 ఇందిరమ్మ ఇళ్లకు లక్కీ డ్రా ప్రక్రియను ప్రారంభించామని తెలిపారు. ఈ ఇళ్ల కోసం మొత్తం 1,881 మంది దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు రిజర్వేషన్ అమలు చేస్తూ లక్కీ డ్రా ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తయిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించేందుకు హౌసింగ్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) డాక్టర్ కె.కిరణ్మయి, రాజేంద్రనగర్ ఆర్డీఓ శ్రీధర్, పీడీ హౌసింగ్ చంప్లానాయక్ తదితరులు పాల్గొన్నారు.


