Telangana: రాష్ట్రంలో 7.15 శాతం పెరిగిన నేరాలు | Telangana sees 7. 15 pc increase in crime over past three years | Sakshi
Sakshi News home page

Telangana: రాష్ట్రంలో 7.15 శాతం పెరిగిన నేరాలు

Aug 29 2026 5:47 AM | Updated on Aug 29 2026 5:47 AM

Telangana sees 7. 15 pc increase in crime over past three years

సైబర్, ఆర్థిక నేరాల్లో తగ్గుదల 

ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన కేసుల్లో 9.48 శాతం పెరుగుదల 

వెల్లడించిన తెలంగాణ పోలీస్‌శాఖ గణాంకాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నేరాల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. గత మూడేళ్లలో అన్ని రకాల నేరాల సంఖ్యలో 7.15 శాతం పెరుగుదల నమోదైనట్టు పోలీస్‌ గణాంకాలు వెల్లడించాయి. ఇదే సమయంలో ప్రతి లక్ష జనాభాకు నేరాల నమోదు రేటు 481.58 నుంచి 491.59కి పెరిగింది. పోలీస్‌శాఖ అధికారుల అర్ధవార్షిక క్రైం సమీక్ష సమావేశంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నేరాల నమోదు..పలు రకాల నేర సరళి తదితర గణాంకాలను పోలీస్‌శాఖ వెల్లడించింది. అందులో పేర్కొన్న ప్రకారం.. 

తీవ్ర నేరాల్లో 10.33% తగ్గుదల  
తీవ్ర నేరాలు (గ్రేవ్‌ క్రైమ్‌) గత ఏడాదితో పోలిస్తే గణనీ    యంగా తగ్గాయి. 2024–25లో 7,019 కేసులు నమోదు కాగా.. 2025–26 జూలై వరకు 6,294కు తగ్గాయి. ప్రధాన కమిషనరేట్లలో పరిశీలిస్తే హైదరాబాద్‌లో 1,483 నుంచి 1,094కు తగ్గింది. సైబరాబాద్‌లో 656 నుంచి 613కు, మల్కాజిగిరిలో 664 నుంచి 549కు తగ్గాయి. అయితే కొన్ని జిల్లాల్లో తీవ్ర నేరాలు పెరిగాయి. చిన్న, గిరిజన జిల్లాల్లో పెరుగుతున్న తీవ్ర నేరాలపై ప్రత్యేక దృష్టి అవసరమని గణాంకాలు సూచిస్తున్నాయి. 

పెరుగుతున్న సాధారణ నేరాలు  
రాష్ట్రంలో తీవ్ర నేరాలు తగ్గుతున్నా, సాధారణ నేరాలు (నాన్‌–గ్రేవ్‌) మాత్రం పెరుగుతున్నాయి. 2023–24లో 2,59,201గా ఉండగా, 2025–26 జూలై నాటికి 2,78,069 కేసులకు చేరాయి. కమిషనరేట్లలో పరిశీలిస్తే..ఫ్యూచర్‌ సిటీలో 23.70 శాతం, సైబరాబాద్‌లో 17.32 శాతం, మల్కాజిగిరిలో 13.53 శాతం పెరుగుదల నమోదైంది. హైదరాబాద్‌లో మాత్రం 2.77 శాతం తగ్గుదల కనిపించింది.  

ట్రాఫిక్‌ నేరాల్లో 9.48 శాతం పెరుగుదల 
రాష్ట్రంలో ట్రాఫిక్‌ సంబంధిత నేరాల్లో పెరుగుదల నమోదవుతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2023–24లో 29,130 కేసులు ఉండగా, 2025–26లో 31,891కు చేరాయి. అన్ని జిల్లాల్లో ఈ తరహా కేసులు పెరుగుతుండగా, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, వికారాబాద్‌లో మాత్రం తగ్గుదల కనిపించింది. 

సైబర్, ఆర్థిక నేరాల్లో ఊరట  
సైబర్‌ నేరాలు 2024–25తో పోలిస్తే 2025–26లో 13.29 శాతం తగ్గాయి. మొత్తంగా నేరాల సరళిని పరిశీలిస్తే.. తీవ్ర నేరాలు, సైబర్, ఆర్థిక నేరాల్లో తగ్గుదల కనిపిస్తున్నా, మాదక ద్రవ్యాలు, వ్యవస్థీకృత నేరాలు, సాధారణ నేరాలు, ట్రాఫిక్‌ నేరాల్లో పెరుగుదల నమోదైంది.

నార్కోటిక్‌ కేసుల్లో 46.10% పెరుగుదల  
రాష్ట్రంలో నార్కోటిక్‌ కేసుల పెరుగుదల పోలీస్‌శాఖకు ప్రధాన సవాలుగా మారుతోంది. 2023–24లో 2,026 కేసులు ఉండగా.. 2025–26 జూలై నాటికి 2,960లకు చేరాయి. కమిషనరేట్లలో సైబరాబాద్‌లో 266 నుంచి 508కు చేరి 90.98 శాతం పెరుగుదల నమోదైంది. వరంగల్‌లోనూ మూడేళ్లలో 142.31 శాతం పెరిగాయి. జిల్లాల్లో ఆదిలాబాద్‌లో 57 నుంచి 219 వరకు కేసులు పెరిగాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement