
వికలాంగుల వివాహ కానుక పథకం నిబంధనల్లో మార్పులు
ఇప్పటివరకు ఒక్కరు దివ్యాంగులైతేనే పథకం వర్తింపు
ఇకపై ఇద్దరు వికలాంగులు వివాహం చేసుకున్నా రూ.లక్ష సాయం
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని దివ్యాంగులకు ప్రభుత్వం కానుక ప్రకటించింది. వికలాంగులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నట్లుగా.. ‘వికలాంగుల వివాహ కానుక’పథకం నిబంధనల్లో మార్పులు చేసింది. ఇప్పటివరకు వివాహం చేసుకున్న జంటలో ఒకరు మాత్రమే దివ్యాంగులు ఉంటేనే ఈ పథకం వర్తిస్తుండగా, ఇకపై ఇద్దరూ దివ్యాంగులైనా పథ కం వర్తిస్తుంది. ఈ మేరకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీచేశారు.
ఎక్కువ మందికి ప్రయోజనం
సాధారణ వ్యక్తులు దివ్యాంగులను వివాహం చేసుకునేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద అర్హులకు ప్రభుత్వం రూ.1 లక్ష అందజేస్తుంది. కానీ, చాలా సందర్భాల్లో వివాహం చేసుకునే అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ దివ్యాంగులు ఉంటున్నారు. వీరికి ఈ పథకం వర్తించటంలేదు. దీంతో నిబంధనలు మార్చి ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకున్నా ఆర్థికసాయం అందించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు పెద్ద ఎత్తున వినతులు అందాయి.
దీంతో గతేడాది ఏప్రిల్ 18న ఈ శాఖ అధికారులు పథకం నిబంధనల్లో మార్పులు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా నిబంధనలను సవరించింది. ఇకపై దివ్యాంగులను సాధారణ వ్యక్తులు వివాహం చేసుకున్నా, ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆ జంటలోని మహిళ బ్యాంకు ఖాతాలో రూ.లక్ష ఆర్థిక సాయాన్ని జమ చేస్తుంది. ఈ నిబంధనలు తక్షణమే అమలు చేయాలని అనితా రామచంద్రన్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
పదేళ్ల పోరాట ఫలితం: ముత్తినేని వీరయ్య
వికలాంగుల వివాహ కానుక పథకం నిబంధనలు సడలించాలని పదేళ్లు పోరాటం చేశామని, ప్రస్తుత ప్రభు త్వం స్పందించి ఉత్తర్వులు జారీ చేయడం శుభపరిణామమని తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య మంగళవారం ఒక ప్రకటనలో హ ర్షం వ్యక్తం చేశారు. దివ్యాంగులందరికీ న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకున్నందుకు సీఎం ఎ.రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.