బ్రిటిష్‌ కౌన్సిల్‌తో తెలంగాణ ఒప్పందం

Telangana Govt British Council Renew Partnership For Research Innovation - Sakshi

యువతకు విద్యారంగంలో అవకాశాలు 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ యువతకు విద్యారంగంలో విశ్వవ్యాప్తంగా అవకాశాలు కల్పించే లక్ష్యంతో గతంలో ఉన్న భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ ఇంగ్లండ్‌కు చెందిన బ్రిటిష్‌ కౌన్సిల్, రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. మూడేళ్ల పాటు ఈ ఒప్పందం కొనసాగుతుంది. ఇందులో భాగంగా తెలంగాణ, యూకేలోని విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీల మధ్య సమన్వయం కోసం తెలంగాణ ప్రభుత్వ సంస్థ రిచ్‌ (రీసెర్చ్‌ ఇన్నోవేషన్‌ సర్కిల్‌ ఆఫ్‌ హైదరాబాద్‌), బ్రిటిష్‌ కౌన్సిల్‌ సంయుక్తంగా కృషి చేస్తాయి.

అంతరిక్షం, రక్షణ, జీవ, ఔషధ, ఆహారం, వ్యవసాయం, ఆంగ్లం, సుస్థిరాభివృద్ధి వంటి రంగాల్లో రిచ్‌తో పాటు బ్రిటిష్‌ కౌన్సిల్‌ నాలెడ్జ్‌ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తుంది. తెలంగాణ యువతకు అవసరమైన నైపుణ్యాలు, ఉత్తమ విధానాల్లో శిక్షణ కోసం అవసరమయ్యే ఆవిష్కరణలపై యూకే, రిచ్‌ కలిసి పనిచేస్తాయి. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, రిచ్‌ డైరెక్టర్‌ జనరల్‌ అజిత్‌ రంగ్నేకర్, తెలంగాణ, ఏపీ బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్, దక్షిణ భారత విభాగం బ్రిటిష్‌ డైరెక్టర్‌ జనక పుష్పనాథన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top