దీనివల్ల వారికీ ఒకటో తేదీనే జీతాలిచ్చేలా చర్యలు తీసుకోండి: సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాలన మరింత పారదర్శకతతో నిర్వహించేందుకు డిజిటల్ గవర్నెన్స్ దిశగా చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయడంతోపాటు అవసరమైన చట్టాలను రూపొందించాలన్నారు. మంగళవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
ప్రజలకు మెరుగైన సేవలను అందించడంతోపాటు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు అందించేందుకు వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ విభాగాల్లోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, వారి జీతాలు, బ్యాంక్ ఖాతాల వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని చెప్పారు.
పీఎఫ్ ఇవ్వని ఏజెన్సీలపై చర్యలు
రాష్ట్రంలో దాదాపు 4,800 కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఉండగా.. ఇందులో 4,300 ఏజెన్సీలు ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించడం లేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఏజెన్సీలకు ప్రభుత్వం చెల్లింపులు చేసినా, ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించడం లేదని వివరించారు. ఉద్యోగులకు వేతనాలు చెల్లించకపోవడంతో ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుందని, నిర్లక్ష్యంగా వహిస్తున్న ఏజెన్సీల పట్ల ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడాన్ని కూడా సీఎం తప్పు పట్టినట్లు సమాచారం. అలాంటి ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డిజిటల్ గవర్నెన్స్తో ఈ సమస్యకు చెక్ పెట్టాలని సూచించారు.
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 1 నుంచి గరిష్టంగా 5వ తేదీలోగా పారదర్శకంగా జీతాల చెల్లింపులు జరిపేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందన్నారు. పూర్తి వివరాలను డిజిటలైజ్ చేసేందుకు వివిధ విభాగాల అధికారులతో ఒక కమిటీని నియమించాలని సూచించారు. కమిటీ వంద రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. హెల్త్ కార్డులు, ఇతర ప్రయోజనాలు అమలు చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను కూడా డిజిటలైజ్ చేయాలన్నారు. నిరంతరం పర్యవేక్షించేందుకు ఆర్థిక శాఖ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఎంఏయూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎం ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి, ఎంసీఆర్హెచ్ఆర్డీ వైస్ చైర్మన్ శాంతి కుమారి, వేతన సవరణ కమిషనర్ ఎన్.శివ శంకర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, ప్రణాళికా విభాగం కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పనిచేసే వారికి వేతనాలివ్వరా?
ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాల చెల్లింపుల్లో జాప్యంపై సీఎం రేవంత్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ కార్యక్రమాల అమలులో బాధ్యతగా పనిచేస్తున్న వారి పట్ల నిర్లక్ష్యం వహించడాన్ని తీవ్రంగా పరిగణించారు. క్షేత్రస్థాయిలో బిల్లులు రాకపోవడంతో చెల్లింపులు నిలిచిపోయినట్లు ఆర్థిక శాఖ అధికారులు చెప్పినప్పటికీ... ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. బిల్లులు అందకపోవడం, చెల్లింపులు చేసినా ఏజెన్సీలు పంపిణీ చేయలేదనే కారణాలపై ఆయన సంతృప్తి చెందలేదు. వేతన చెల్లింపుల్లో జాప్యంపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఏమాత్రం వెనక్కు తగ్గవద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.


