తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో ఈరోజు విద్యుత్ శాఖకు చెందిన TG GENCO, TG TRANSCO, TGSPDCL, TGNPDCL సంస్థల సీఎండీలతో జాయింట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల డిమాండ్లతో పాటు JAC ప్రతిపాదించిన 12 ప్రధాన డిమాండ్లపై JAC ప్రతినిధులు సీఎండీలతో సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా JAC కన్వీనర్ శివాజీ మాట్లాడుతూ.. ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను, ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న అన్ని డిమాండ్లను మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. 01-04-2026 నాటికి అమలు కావాల్సిన PRC కోసం వెంటనే కమిటీ ఏర్పాటు చేసి, ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అదేవిధంగా ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని మేనేజ్మెంట్ను కోరినట్లు తెలిపారు.
JAC కో-చైర్మన్ అంజయ్య మాట్లాడుతూ, 1999 నుంచి 2004 మధ్యకాలంలో రిక్రూట్ అయిన EPF ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అదేవిధంగా EPF ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం పెన్షన్ సౌకర్యం లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, సంస్థలో సుదీర్ఘకాలం సేవలందించిన రిటైర్డ్ EPF ఉద్యోగులకు మానవతా దృక్పథంతో మెడికల్ సౌకర్యం కల్పించాలని మేనేజ్మెంట్ను కోరినట్లు తెలిపారు.
12 డిమాండ్లపై సుదీర్ఘ చర్చ
సమావేశంలో PRC, ప్రమోషన్లు, బదిలీలు, EPF పెన్షన్, రిటైర్డ్ EPF ఉద్యోగులకు మెడికల్ సౌకర్యం తదితర అంశాలతో పాటు ఉద్యోగులకు సంబంధించిన 12 ప్రధాన డిమాండ్లపై JAC ప్రతినిధులు సీఎండీలతో సుదీర్ఘంగా చర్చించారు.
మేనేజ్మెంట్ సానుకూల స్పందన
JAC ప్రతినిధులు ప్రస్తావించిన డిమాండ్లపై సీఎండీలు సానుకూలంగా స్పందించారు. పెండింగ్ సమస్యలను మేనేజ్మెంట్ స్థాయిలో పరిశీలించి, అవసరమైన అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పెండింగ్లో ఉన్న డిమాండ్లపై మరింత చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు మరోసారి JAC–మేనేజ్మెంట్ జాయింట్ సమావేశం నిర్వహించేందుకు మేనేజ్మెంట్ అంగీకరించింది.


