బరాజ్‌ల్లో నీరు నిల్వ చేస్తే ప్రమాదమే | Storing water poses a risk of major accidentsSridhar Babuon medigadda project | Sakshi
Sakshi News home page

బరాజ్‌ల్లో నీరు నిల్వ చేస్తే ప్రమాదమే

Jul 6 2026 4:53 AM | Updated on Jul 6 2026 4:53 AM

Storing water poses a risk of major accidentsSridhar Babuon medigadda project

మేడిగడ్డ కొట్టుకుపోతుందని హెచ్చరించిన ఎన్డీఎస్‌ఏ 

అందుకే వరద నీటిని వదిలేస్తున్నాం మంత్రి శ్రీధర్‌బాబు 

భూపాలపల్లి: మేడిగడ్డలో పిల్లర్‌ కుంగిపోయింది.. అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల్లో సీపేజీ లీకేజీ లోపాలున్నాయి, ఇటువంటి సమయంలో వరద నీటిని నిల్వ చేస్తే భారీ ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీధర్‌బాబు మాట్లాడారు. గత పాలకులే ఇంజనీర్లుగా వ్యవహరించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం మూలంగా మేడిగడ్డ బరాజ్‌ వద్ద బ్లాక్‌–7లో 20 పిల్లర్‌ పూర్తిగా కుంగిపోయిందన్నారు. 

నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) అధికారులు బరాజ్‌లను సందర్శించి వరద నీటిని నిల్వ చేస్తే మేడిగడ్డ కొట్టుకుపోతుందని చెప్పారని పేర్కొన్నారు. ఫలితంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు వరద ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం కలిగించడమే బీఆర్‌ఎస్‌ నాయకుల ఉద్దేశమా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ నాయకులకు అన్నీ తెలిసినా, తప్పు చేశామని సిగ్గు పడకుండా, కాంగ్రెస్‌ పార్టీని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

తాము ఎన్‌డీఎస్‌ఏ సూచనలను అమలు చేస్తున్నామన్నారు. బరాజ్‌లను మరమ్మతు చేశాకే నీటిని నిల్వ చేస్తామని, అప్పటి వరకు వరద నీటిని వదిలేస్తామని వెల్లడించారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్‌ జిల్లాల రైతులు ఏం పాపం చేశారని, కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు అందకుండా చేశారని మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. సమావేశంలో రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ అయిత ప్రకాష్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, నాయకులు పాల్గొన్నారు.  

మేడిగడ్డకు 76,400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో 
కాళేశ్వరం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్‌కు ఎగువ మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నది ద్వారా 76,400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో తరలివస్తోంది. ఆదివారం ఉదయం 90,580 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో తరలిరాగా సాయంత్రం వరకు కాస్త తగ్గింది. దీంతో ఇంజనీరింగ్‌ అధికారులు మొత్తం బరాజ్‌లోని 85 గేట్లు ఎత్తి నీటిని అదేస్థాయిలో ఔట్‌ఫ్లో రూపంలో దిగువకు తరలిస్తున్నారు.

నిధులు ఎత్తుకెళ్లేందుకే కాళేశ్వరం నిర్మాణం 
రాజకీయ డ్రామాలకు తెరలేపుతున్న కేటీఆర్‌: మంత్రి సీతక్క 
ములుగు రూరల్‌: నిధులు ఎత్తుకెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరంగా మారిందని మంత్రి సీతక్క ఆరోపించారు. ములుగు జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. మేడిగడ్డ పంపుహౌస్‌ నుంచి కన్నెపల్లి పంపుహౌస్‌కు నీళ్లను ఎత్తిపోయాలని కేటీఆర్‌ రాజకీయ డ్రామాలకు తెరలేపుతున్నారన్నారు. ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోవడంతో నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) సూచనల మేరకు నీళ్లు ఎత్తిపోయడం నిలిపివేసినట్టు తెలిపారు. 

డ్యామ్‌ భద్రంగా ఉన్నప్పుడు నీళ్లు ఇవ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. మేడిగడ్డ బరాజ్‌లో నీటిని నింపితే గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని గిరిజన గ్రామాలు కొట్టుకుపోయే అవకాశం ఉందన్నారు. ప్రమాదం జరిగితే బాధ్యత కేసీఆర్, కేటీఆర్‌ వహిస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ స్వయంప్రకటిత ఇంజనీర్‌ అవతారం ఎత్తి నిపుణుల సూచనలు తీసుకోకుండా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారిందన్నారు. 

రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజా సంక్షేమం కోసం ప్రజాపాలన కొనసాగిస్తుంటే ఓర్వలేక బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి ములుగు నియోజకవర్గంలో గోదావరి జలాల మళ్లింపునకు రూ.200 కోట్లు కేటాయించారని వెల్లడించారు. వైఎస్‌ఆర్‌ ఆధ్వర్యంలో జలయజ్ఞం పేరుతో రాష్ట్రంలో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని గుర్తుచేశారు. కేటీఆర్, హరీశ్‌రావు ప్రజా సమస్యలపై పోరాడాలని మంత్రి సీతక్క హితవు పలికారు.  

పెంబర్తిలో కేటీఆర్‌ కాన్వాయ్‌.. ఆలేరు శివారులో మంత్రి సీతక్క 
జనగామ: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో జనగామ జిల్లా పెంబర్తి వద్ద ఆదివారం కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అదే సమయంలో హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు వస్తున్న రాష్ట్ర మంత్రి సీతక్క కాన్వాయ్‌ని కూడా భద్రతా కారణాల దృష్ట్యా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు శివారులో పోలీసులు తాత్కాలికంగా నిలిపివేశారు. 

పెంబర్తి వద్ద పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చి, కేటీఆర్‌ కాన్వాయ్‌ ముందుకు వెళ్లిన సుమారు 10 నిమిషాల తర్వాత మంత్రి సీతక్క కాన్వాయ్‌కి అనుమతి ఇచ్చి వరంగల్‌ వైపు పంపించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. రహదారికి ఇరువైపులా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement