
అరుదైన భూగర్భ ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలతో తీవ్ర ప్రభావం
ప్రపంచంలోకెల్లా 80 శాతానికిపైగాఆర్ఈఈల వెలికితీత, ఎగుమతులుచైనా నుంచే..
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో కీలకమైన అరుదైన భూగర్భ ఖనిజాలు (రేర్ ఎర్త్ ఎలిమెంట్స్) ఆర్ఈఈ ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంతో తెలంగాణలో సంబంధిత రంగాలకు చెందిన పరిశ్రమల్లో ఆందోళన నెలకొంది. ఎలక్ట్రానిక్స్, ఈవీల ఉత్పత్తికి అవసరమైన రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లు, ముడిపదార్థాలు, రసాయనాలను ఎక్కువగా చైనా నుంచే తెలంగాణ దిగుమతి చేసుకుంటోంది. అయితే అమెరికాతో ట్రేడ్ వార్లో భాగంగా ఆర్ఈఈల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించింది.
ఏప్రిల్ 4న మొదలైన నిషేధం మరింతకాలంపాటు కొనసాగితే తెంలగాణలో తయారీ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్ఈఈలు లభ్యమయ్యే ప్రత్యామ్నాయ మార్గాలు, ప్రణాళికలు, వ్యూహాలు లేకపోవడంతో సమస్య తీవ్రమయ్యే సూచన కనిపిస్తోంది. మరోవైపు ఆర్ఈఈల ఉత్పత్తి పెంచేందుకు రూ. 5 వేల కోట్లతో కేంద్రం ప్రకటించిన దీర్ఘకాలిక పథకంతో తక్షణ ఉపశమనం లభించే అవకాశం కనిపించకపోవడంతో ఈవీ, ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమలు ఆందోళన చెందుతున్నాయి.
ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావం
ఎలక్ట్రానిక్ వాహనాలు, స్మార్ట్ఫోన్లతోపాటు విండ్ టర్బైన్లకు అవసరమయ్యే శాశ్వత మ్యాగ్నెట్ల తయారీలో నియోడిమియం, డిస్ప్సోసియం, టెర్బియం వంటి అరుదుగా లభించే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అత్యంత కీలకం. ప్రపంచంలోకెల్లా ఈ ఆర్ఈఈల వెలికితీత, శుద్ధి, ఎగుమతుల్లో 80 శాతం మార్కెట్ను చైనా నియంత్రిస్తోంది. గతేడాది చైనా నుంచి భారత్ 2,270 టన్నుల ఆర్ఈఈలను దిగుమతి చేసుకుంది. చైనా విధించిన ఆంక్షల మూలంగా ఆర్ఈఈల లభ్యత, ధరల పెరుగుదల వంటి సమస్యలను తెలంగాణ పరిశ్రమలు ఎదుర్కొంటున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్, ఈవీ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణకు ప్రాధాన్యతను ఇస్తుండగా అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొనడం వల్ల పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్ర అవసరాల మేరకు దిగుమతులు లేకపోవడంతోపాటు ఉత్పాదనలో ఆలస్యం వల్ల నష్టాలు పెరిగి ఉద్యోగ కల్పనపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని అంటున్నాయి. దీర్ఘకాలంపాటు ఇదే పరిస్థితి కొనసాగితే అంతర్జాతీయ మార్కెట్తో పోటీ పడలేమనే భయం పరిశ్రమ వర్గాల్లో నెలకొంది.
ప్రత్యామ్నాయ మార్గాలు ఫలితమిచ్చేనా?
ఈ ఏడాది చివరి నాటికి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులను 3 బిలియన్ డాలర్లకు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. మరోవైపు 2030 నాటికి ప్రజారవాణా రంగంలో వంద శాతం ఎలక్ట్రానిక్ వాహనాలను ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తోంది. పునరుత్పాదక ఇంధన రంగం ద్వారా 2030 నాటికి 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆ్రస్టేలియా, కెనడా వంటి దేశాల నుంచి ఆర్ఈఈల దిగుమతి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్కు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ఇటీవల వినతిపత్రం ఇచ్చారు.