ప్రియురాలు పిలిచిందని వెళ్తే.. | Sensational Details Out Secunderabad Chilakalguda Yuvan Case | Sakshi
Sakshi News home page

ప్రియురాలు పిలిచిందని వెళ్తే..

May 8 2026 8:43 AM | Updated on May 8 2026 11:02 AM

Sensational Details Out Secunderabad Chilakalguda Yuvan Case

సాక్షి, హైదరాబాద్‌: నగరం నడిబొడ్డున దారుణం చోటు చేసుకుంది. ఫోన్‌లో క్రికెట్‌ మ్యాచ్‌ చూస్తున్న ఓ యువకుడిపై కొందరు కత్తులతో దాడి చేశారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం రాత్రి సికింద్రాబాద్‌ చిలకలగూడలో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. 

ఆల్వాల్‌లోని యాప్రాల్‌లో నివాసం ఉంటున్న యువన్‌.. నగర శివారులో ఓ కాలేజీలో బీటెక్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం రాత్రి చిలకలగూడకు వచ్చి స్నేహితులతో కలిసి రోడ్డు పక్కన ఫోన్‌లో మ్యాచ్‌ చూస్తూ మునిగిపోయాడు. ఈలోపు బైకులపై వచ్చిన ఏడుగురు యువన్‌ను పక్కకు లాక్కెళ్లి దాడి చేశారు. ఈ పరిణామంతో ఆ యువకులు చెల్లాచెదురుకాగా.. కత్తులతో దాడి చేయడంతో తీవ్రగాయాలతో యువన్‌ అక్కడికక్కడే ప్రాణం విడిచాడు. 

సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. తల, మెడ, చేతులు మొత్తం 15 కత్తిపోట్లు పడ్డాయని వైద్యులు తెలిపారు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తొలుత భావించగా.. తర్వాత అదే నిర్ధారణ అయ్యింది. 

యువన్‌ స్థానికంగా ఉండే ఓ అమ్మాయిని ఐదేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయంలో పెద్దలకు తెలిసి గొడవ జరగడంతో పంచాయితీ పెట్టారు. అయితే కలుద్దామని యువతి గురువారం యువన్‌కు మెసేజ్‌ చేసింది. దీంతో యువన్‌ చిలకలగూడకు రాగా.. తట్టుకోలేకపోయిన యువతి సోదరుడు స్నేహితుల సాయంతో ఘాతుకానికి పాల్పడ్డాడు. 

చిలకలగూడలో ఉద్రిక్తత
యువన్‌ హత్య నేపథ్యంలో శుక్రవారం ఉదయం చిలకలగూడలో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. అతని తల్లిదండ్రులు, బంధువులు యువతి నివాసం ఎదుట రోడ్డు మీద బైఠాయించి న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. పోలీసులు వాళ్లకు సర్దిచెప్పే ప్రయత్నంలో తోపులాట జరిగింది. దీంతో లాఠీఛార్జ్‌ చేసి అందరినీ చెదరగొట్టారు. 

తాజా పరిస్థితుల నేపథ్యంలో సీతాఫల్‌మండి, నామాలగుండు ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు.. ఘాతుకానికి పాల్పడ్డ వాళ్లలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. అలాగే యువతి కుటుంబం కూడా పోలీసుల అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది. 

వస్తే చంపేస్తారని చెప్పిందా?
ఏడాది నుంచి యువన్‌ ఆ యువతితో మాట్లాడడం లేదని సోదరి మీడియా ముందు వాపోయింది. ‘‘పెద్దల అంగీకారంతో అప్పట్లో కాంప్రమైజ్‌ జరిగింది. ఇద్దరి మధ్య మాటలు లేకపోవడంతో అంతా సర్దుమణిగింది అనుకున్నాం. అయితే నిన్న మా తమ్ముడు ఆమె కోసం చిలకలగూడకు వచ్చాడు. వస్తే చంపేస్తారని కూడా యువతి ఫోన్‌లో చెప్పింది(అందుకు సంబంధించిన కాల్‌ సంభాషణను బయటపెట్టారు). ఆమె సోదరి, కుటుంబ సభ్యులకు నేర చరిత్ర ఉంది. మా తమ్ముడిని అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారు. వాళ్లందరినీ ఉరి తీసి మాకు న్యాయం చేయండి’’ అని వాపోయిందామె.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement