కొత్త కొత్వాల్‌గా విశ్వనాథ్‌ చెన్నప్ప సజ్జనార్‌ | Sajjanar is New Hyderabad Police Commissioner | Sakshi
Sakshi News home page

కొత్త కొత్వాల్‌గా విశ్వనాథ్‌ చెన్నప్ప సజ్జనార్‌

Sep 28 2025 9:53 AM | Updated on Sep 28 2025 10:39 AM

Sajjanar is New Hyderabad Police Commissioner

అదనపు సీపీ (క్రైమ్‌ అండ్‌ సిట్‌)గా ఎం.శ్రీనివాసులు  

సాక్షి, హైదరాబాద్‌: నగర పోలీసు కమిషనర్‌గా 1996 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి విశ్వనాథ్‌ చెన్నప్ప సజ్జనార్‌ను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పని చేస్తున్న సీవీ ఆనంద్‌ను హోంశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా 23 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీల నేపథ్యంలో.. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో కీలక మార్పుచేర్పులు చోటు చేసుకున్నాయి. అదనపు సీపీగా (శాంతిభద్రతలు) పని చేస్తున్న విక్రమ్‌సింగ్‌ మాన్‌ను అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ జనరల్‌గా నియమించింది. 

ఈ స్థానంలో తఫ్సీర్‌ ఇక్బాల్‌ను సంయుక్త సీపీ హోదాలో నియమించింది. ప్రస్తుతం సీఐడీలో ఐజీ హోదాలో ఉన్న ఎం.శ్రీనివాసులుకు అదనపు సీపీ (నేరాలు, సిట్‌)గా పోస్టింగ్‌ ఇచ్చింది. ఇక్కడ పని చేస్తున్న పి.విశ్వప్రసాద్‌ ఇటీవల తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సరీ్వస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) సభ్యులుగా నియమితులైన విషయం విదితమే. వెస్ట్‌జోన్‌ డీసీపీగా పని చేస్తున్న ఎస్‌ఎం విజయ్‌కుమార్‌ సిద్ధిపేట పోలీసు కమిషనర్‌గా వెళ్తున్నారు. ఆ స్థానంలోకి రాజేంద్రనగర్‌ డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌ బదిలీ అయ్యారు. సిద్ధిపేట సీపీ డాక్టర్‌ బి.అనురాధ ఎల్బీనగర్‌ జోన్‌ డీసీపీగా వస్తున్నారు. నారాయణపేట ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ రాజేంద్రనగర్‌ డీసీపీగా బదిలీ అయ్యారు. ఏసీబీలో పని చేస్తున్న రితిరాజ్‌ను మాదాపూర్‌ డీసీపీగా ప్రభుత్వం నియమించింది.  

సజ్జనార్‌ నేపథ్యమిదీ.. 
కర్ణాటకలోని హుబ్లీకి చెందిన వీసీ సజ్జనార్‌ అక్కడి జీజీ కామర్స్‌ కాలేజీలో బీకాం పూర్తి చేశారు. ధారవాడ్‌లోని కర్ణాటక విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా పొందారు. 1996లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. 2018 నుంచి ఆగస్టు 2021 వరకు కీలకమైన సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా పని చేశారు. సెప్టెంబర్‌ 2021లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆరీ్టసీ) వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. అక్కడ ఉంటూనే బెట్టింగ్‌ యాప్స్‌పై ‘హ్యాష్‌ట్యాగ్‌ సే నో టు బెట్టింగ్‌ యాప్స్‌’ పేరుతో సోషల్‌ మీడియాలో పెద్ద ఉద్యమమే చేశారు. దీంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్స్‌పై  ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేసింది.  

 

Advertisement
 
Advertisement
Advertisement