బండి సంజయ్ వ్యాఖ్యలపై ఉద్యోగ జేఏసీ ఆగ్రహం
నాంపల్లిలో నిరసన ర్యాలీ
నాంపల్లి: ఉద్యోగ సంఘాలు అమ్ముడుపోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఉద్యోగ జేఏసీ నేతలు నిరసన తెలిపారు. జేఏసీ చైర్మన్ మామిళ్ళ రాజేందర్ నేతృత్వంలో నాంపల్లిలోని టీఎన్జీవో కేంద్ర సంఘం కార్యాలయం నుంచి ఏ–వన్ సిగ్నల్ వరకు చేరుకుని, అక్కడి నుంచి తిరిగి టీఎన్జీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
సోమవారం జరిగిన ర్యాలీలో ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలను నిరసిస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ సెక్రటరీ జనరల్ వి.మమత, టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, టీఎన్జీవో నేతలు గండూరి వెంకటేశ్వర్లు, కస్తూరి వెంకటేశ్వర్లు, రామినేని శ్రీనివాసరావు, ఎస్.ఎం.హుస్సేన్, శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు.