
పథకాల అమలుకు ముందు చర్చ జరిగాక శ్రీకారం చుట్టాలి
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన విందులో మంత్రుల సూచన
రాష్ట్ర రాజకీయాలపై మంత్రుల పిచ్చాపాటి
హాజరైన రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్
సాక్షి హైదరాబాద్: కేబినెట్ సహచరులకు సీఎం రేవంత్రెడ్డి విందు ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ మంత్రులకు విందు ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. గురువారం నుంచి మంత్రుల జిల్లాల పర్యటన, ఈ నెల 30న మరోమారు ఢిల్లీ పర్యటన, మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న ఊహాగానాలు, రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణ నేపథ్యంతోపాటు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ అందుబాటులో ఉండటంతో బుధవారం సాయంత్రం తన నివాసంలో రేవంత్ విందు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మంత్రులు ఇష్టాగోష్టి మాట్లాడుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంచేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ముందుగా చేయాల్సిన కసరత్తు గురించి మంత్రులు మాట్లాడుకున్నట్లు తెలిసింది. పథకం అమలుకుముందే అందరితో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకుంటే మంచిదని, ఫలానా పథకం అమలు చేసే అవకాశం ఉందన్న ఫీలర్ను ముందుగా ప్రజల్లోకి పంపి.. విస్తృత చర్చ జరిగిన తర్వాత శ్రీకారం చుడితే బాగుంటుందని మంత్రులు సూచించినట్లు తెలిసింది.
అటు పార్టీ, ఇటు ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని, భవిష్యత్తులో కలిసికట్టుగా ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్లను ఎదుర్కోవాలనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతోపాటు ఆర్థికపరమైన అంశాల విషయంలో మంత్రులందరూ ఆచితూచి మాట్లాడాలని, ఆర్థిక పరిస్థితులను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని నిర్ణయానికి వచి్చనట్లు తెలిసింది. జిల్లాల పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క మినహా హైదరాబాద్లో ఉన్న అందరు మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ విందుకు హాజరయ్యారు.
ఆపరేషన్ సిందూర్ హడావిడి విరమణ నేపథ్యంలో ప్రధాని మోదీకి తగ్గిన గ్రాఫ్, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, మాదిగ ఎమ్మెల్యేల డిమాండ్, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులతో మీనాక్షి నటరాజన్ ముఖాముఖి సమావేశంలో భాగంగా వచ్చిన అంశాలు, బీఆర్ఎస్ పంచాయతీ ఎపిసోడ్, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం వంటి అంశాలపై మంత్రులు తమ తమ అభిప్రాయాలను పంచుకున్నట్టు తెలిసింది.
రెండు రోజులు జిల్లాల్లో మంత్రులు
రాష్ట్ర మంత్రివర్గం గురువారం నుంచి రెండు రోజులపాటు జిల్లాల్లోనే ఉండనుంది. ఈ నెల 29, 30 తేదీల్లో జిల్లాల్లో పర్యటించి ఇందిరమ్మ ఇళ్లు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించాలన్న సీఎం ఆదేశాల మేరకు మంత్రులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ అంశంపై కూడా విందు సమావేశంలో చర్చకు వచి్చందని, జిల్లాల్లో జరిగే సమీక్షలకు సంబంధించి జూన్ ఒకటికల్లా తనకు నివేదిక ఇవ్వాలని సీఎం మంత్రులను ఆదేశించినట్లు సమాచారం.