పార్టీ పరిశీలకులు గ్రామాలకు వెళ్లాలి | Party observers should go to villages | Sakshi
Sakshi News home page

పార్టీ పరిశీలకులు గ్రామాలకు వెళ్లాలి

Jun 5 2025 1:19 AM | Updated on Jun 5 2025 1:19 AM

Party observers should go to villages

రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ 

కార్యకర్తలకు భరోసా కల్పించాలి.. వారి సమస్యలను పరిష్కరించాలి 

పార్టీ కమిటీల నియామకాలను పూర్తి చేయాలి 

పీసీసీ పరిశీలకులతో మీనాక్షి సమావేశం 

జై భీమ్‌.. జై బాపూ కార్యక్రమంపై నేతలకు ప్రశంసలు 

హాజరైన పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ పరిశీలకులుగా నియమితులైన నేతలందరూ గ్రామాలకు వెళ్లాలని, కార్యకర్తలకు భరోసా కల్పించే దిశలో తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ కోరారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయాలని సూచించారు. బుధవారం గాం«దీభవన్‌లో ఆమె ‘జై భీమ్‌.. జై బాపూ.. జై సంవిధాన్‌’కార్యక్రమ సమన్వయకర్తలు, పీసీసీ పరిశీలకులతో సమావేశమయ్యారు. 

జిల్లాల వారీగా పరిశీలకులతో భేటీ తర్వాత ఆమె వారితో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం గురించి ఆమె.. నేతలకు దిశానిర్దేశం చేశారు. జిల్లాల్లో పరిశీలకులు బాధ్యతగా పనిచేయాలని, మండల కమిటీలను ఎంపిక చేసే ప్రక్రియను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రతి మండలంలోని 5 గ్రామాలను యూనిట్‌గా చేసి కార్యకర్తల్లో చైతన్యం తీసుకురావాలని, ప్రతి యూనిట్‌కు ఒకరు చొప్పున మండల కమిటీలోకి తీసుకోవాలని చెప్పారు. 

క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నాయకుల్లో నామినేటెడ్‌ పోస్టులకు అర్హులెవరన్న దానిని గుర్తించాలని సూచించారు. జై బాపూ, జై భీమ్‌.. కార్యక్రమం తెలంగాణలో బాగా జరుగుతోందని, దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందున్నామని చెప్పిన ఆమె, సమన్వయకర్తలకు రాహుల్‌ గాంధీ పక్షాన ప్రశంసలు తెలియజేశారు.  

ఫోన్‌ చేసి మాట్లాడిన మీనాక్షి 
సమావేశంలో భాగంగా ప్రతి జిల్లాలో పార్టీ కమిటీల నియామకం ఎంత వరకు వచ్చిందన్న అంశాన్ని మీనాక్షి నటరాజన్‌ ఆరా తీశారు. పరిశీలకులు సమర్పించిన నివేదికలు చూసిన ఆమె, బాగా పనిచేసిన నేతలకు అభినందనలు తెలిపారు. కమిటీల నియామకంలో తాత్సారం చేస్తున్నారన్న నివేదికల మేరకు మహబూబ్‌నగర్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, నల్లగొండకు చెందిన ఓ ఎమ్మెల్సీకి ఆమె నేరుగా ఫోన్‌ చేసి మాట్లాడారు. పార్టీ కమిటీల నియామకాలను వాయిదా వేయవద్దని వారికి సూచించారు.  

మంత్రితో ముఖాముఖి 
కాగా, బుధవారం గాం«దీభవన్‌లో ‘మంత్రితో ముఖాముఖి’కా­ర్యక్రమం జరిగింది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ దాదాపు మూడు గంటల పాటు గాం«దీభవన్‌లో ఉండి ప్రజల నుంచి వారి సమస్యలపై దరఖాస్తులు తీసుకున్నారు. మొత్తం 100కు పైగా వినతిపత్రాలు వచ్చాయని, తక్షణమే పరిష్కరించగలిగిన వాటిపై అధికారులతో అప్పటికప్పుడే మాట్లా­డి పరిష్కరించారని, మిగిలినవి ఆయా శాఖలకు పంపామని మంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. 

భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, రేషన్‌కార్డులు, కరెంటు బిల్లులు, ఇతర సంక్షేమ పథకాల కోసం ప్రజ­లు దరఖాస్తులిచ్చారని తెలిపారు. కాగా, మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ కూడా మంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజ­ల సమస్యలను అడిగి తెలు­సు­కున్నారు. తెలంగాణ ఫిషరీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement