
సాక్షి, సనత్నగర్: భర్తతో మనస్పర్ధలు వచ్చి దూరంగా ఉంటున్న వివాహితను బలవంతంగా హోటల్కు పిలిపించాడు. మత్తు మందు కలిపిన పండ్ల రసం ఇచ్చి ఆమె స్పృహ కోల్పోయేలా చేశాడు. అనంతరం లైంగిక దాడి చేయడమే కాకుండా ఆ సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి కుటుంబ సభ్యులకు పంపుతానని బెదిరించి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ దారుణ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేట ప్రాంతానికి చెందిన మహిళ (37)కు 2013లో వివాహం కాగా, భర్తతో కలిసి మహారాష్ట్రలో నివాసం ఉండేది. భర్తతో మనస్పర్థల కారణంగా గొడవ పడి ఐదు నెలల క్రితం బేగంపేటలోని తన తల్లి ఇంటికి వచ్చి ఉంటోంది. కాగా జనవరిలో నిజాముద్దీన్ అనే వ్యక్తి మహిళకు ఫోన్ చేసి డెలివరీ బాయ్నని చెప్పగా, తాను ఎటువంటి ఆర్డర్ చేయలేదని ఫోన్ పెట్టేసింది. అప్పటి నుంచి నిజాముద్దీన్ తరచూ మహిళకు ఫోన్ చేస్తూ, సందేశాలు పంపుతూ బయటకు రమ్మని తీవ్రంగా ఒత్తిడి చేశాడు. చివరకు అతని వేధింపుల తట్టుకోలేక బాధితురాలు ఓ రోజు నగరంలోని పబ్లిక్ గార్డెన్స్లో కలిసింది.
ఈ క్రమంలో భర్తతో గొడవలు ఉన్నందున అతడికి విడాకులు ఇవ్వాలని, తాను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. విడాకుల కోసం దరఖాస్తు చేసేందుకు ఆమె ఆధార్కార్డు తీసుకున్నాడు. అనంతరం ఓ న్యాయవాదిని కలిసేందుకని గుడిమల్కాపూర్ సమీపంలోని ఓ హోటల్కు తీసుకుపోయాడు. హోటల్లో బాధితురాలికి మత్తు కలిపిన పండ్ల రసం ఇచ్చాడు. బాధితురాలు స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఫొటోలు, వీడియోలు తీశాడు. ఆ తర్వాత న్యాయవాది రాలేదని ఆమెను పంపించేశాడు.
కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసి తనకు లక్ష రూపాయలు ఇవ్వాలని, లేనిపక్షంలో ఫొటోలు, వీడియోలు కుటుంబ సభ్యులకు పంపుతానని బెదిరించాడు. దీంతో భయపడిన మహిళ ఏప్రిల్లో లక్ష రూపాయలు అతనికి ఇచ్చింది. మళ్లీ కొన్ని రోజులకు ఫోన్ చేసి తనను కలవాలని, లేకుంటే ఫొటోలు, వీడియోలు అందరికీ పంపుతానని హెచ్చరించాడు. ఆమె అంగీకరించలేదు. ఓ రోజు స్నేహితురాలితో కలిసి వస్తుండగా బాధితురాలిని కారులో బలవంతంగా తీసుకుపోయాడు. ఓ హోటల్కు తీసుకెళ్లి మరోసారి లైంగిక దాడి చేశాడు. దీంతో బాధితురాలు గురువారం బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు నిజాముద్దీన్పై కేసు నమోదు చేసిన బేగంపేట పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతాన్ని బట్టి గుడిమల్కాపూర్ పోలీస్స్టేషన్కు బదిలీ చేశారు.